
న్యూఢిల్లీ: దేశంలోని టాప్ త్రీ ఐటీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష మందికి పైగా ఫ్రెషర్స్ను నియమించుకోవాలని చూస్తున్నాయి. ఐటీ సర్వీస్లకు డిమాండ్ పెరుగుతుండడంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు హైరింగ్ యాక్టివిటీని పెంచాయి. టీసీఎస్ ఈ ఏడాది జూన్ క్వార్టర్లో 20 వేల మందిని తీసుకుంది. ఇన్ఫోసిస్ 8,300 మందిని, విప్రో 12 వేల మందిని హైర్ చేసుకున్నాయి. కిందటేడాది 40 వేల మంది ఫ్రెషర్స్కు టీసీఎస్ జాబ్స్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా 40 వేలు లేదా అంతకంటే ఎక్కువ మంది ఫ్రెషర్స్ను నియమించుకుంటామని టీసీఎస్ పేర్కొంది. ఇన్ఫోసిస్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్గా 35 వేల మందిని నియమించుకుంటామని ప్రకటించింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో 10 వేల మంది సీనియర్లను, 2 వేల మంది ఫ్రెషర్స్ను నియమించుకున్నామని విప్రో ప్రకటించింది. సెప్టెంబర్ క్వార్టర్లో మరో 6 వేల మందిని హైర్ చేసుకోవడానికి కంపెనీ ప్లాన్స్ వేస్తోంది. 2022–23 నాటికి మొత్తం30 వేల మందికి ఆఫర్ లెటర్స్ అందించాలని చూస్తోంది.