టెక్నాలజీ సాయంతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశమంతా 100 శాతం రేషన్ కార్డుతో ఆధార్ లింక్ పూర్తవుతుందని, దీని ద్వారా ‘వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు’ లక్ష్యాన్ని సాధించగలుగుతామని అన్నారు. ఈ రేషన్ పోర్టబులిటీ వ్యవస్థ ద్వారా వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నా అక్కడే రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీలో భాగంగా రెండో పార్ట్ ను గురువారం సాయంత్రం వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా రైతులు, వలస కూలీలు, చిన్న వ్యాపారులకు సంబంధించిన అంశాలను వెల్లడించారు.
ఆగస్టు కల్లా 83% పోర్టబులిటీ..
ఇతర రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్తున్న వలస కూలీలకు ఆకలి కష్టాలను రేషన్ పోర్టబులిటీ ద్వారా తీర్చవచ్చని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానం ద్వారా దేశంలో ఎక్కడున్న అక్కడి రేషన్ షాపులోనే సరుకులు తీసుకోవచ్చన్నారు. ఈ ఏడాది ఆగస్టు కల్లా 23 రాష్ట్రాల్లోని 83 శాతం రేషన్ కార్డుకు సంబంధించి (67 కోట్ల మంది లబ్ధిదారుల) పోర్టబులిటీ పూర్తవుతుందన్నారు. 2021 మార్చి కల్లా దేశమంతా అన్ని రాష్ట్రాల్లో 100 శాతం రేషన్ పోర్టబులిటీ పూర్తవుతుందదని చెప్పారు.
'One Nation One Ration Card' by March 2021#AatmaNirbharBharatPackage pic.twitter.com/3QiezlPBgr
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 14, 2020