వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం షుఘర్ ల్యాండ్ పట్టణంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మీ ఆలయ పరిసరాల్లో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో ఏర్పాటు చేసిన 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హిందువులు పూజించే ఆంజనేయుడు నకిలీ దేవుడని, ఆ దేవుడి విగ్రహాన్ని టెక్సాస్లో ఎందుకు ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు. అమెరికా క్రైస్తవులు ఉండే దేశమని.. జీసస్ తప్ప మరో దేవుడు లేడని కాంట్రవర్శి కామెంట్స్ చేశాడు.
డంకెన్ వ్యాఖ్యలపై అమెరికాలోని హిందు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఇండో అమెరికన్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ టెక్సాస్ చైర్మన్ అబ్రహం జార్జ్ ఈ వివాదంలోకి దూరారు. జార్జ్ కూడా డంకెన్ మాదిరిగానే మాట్లాడి వివాదానికి మరింత ఆజ్యం పోశారు. డంకన్ ఎవరో తనకు తెలియదని.. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదన్నారు. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని.. ఆయనే జీసస్ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇండియాలో పెంతెకోస్టల్ బోధకుడి కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా, క్రీస్తు అనుచరుడిగా చెబుతున్న.. క్రైస్తవులు విగ్రహాలు, తప్పుడు దేవుళ్ల గురించి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్న డంకెన్తో ఏకీభవిస్తున్నా. ఒకే దేవుడు ఉన్నాడు అది యేసుక్రీస్తు. ఆజ్ఞలు స్పష్టంగా ఉన్నాయి. మీకు వేరే దేవుడు ఉండకూడదు. విగ్రహాలను పూజించకూడదు. ఇది రాజకీయంగా వివాదస్పమవుతోందని తెలిసిన నేను పట్టించుకోను’’ అని అన్నారు అబ్రహం జార్జ్ అన్నారు.
ఇటీవల ఎన్నికలు జరిగిన న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈ మూడు నగరాల్లోని భారతీయ-అమెరికన్ ఓటర్లు రిపబ్లికన్ల నుంచి దూరమై డెమొక్రాట్లకు ఓటు వేయడంతోనే రిపబ్లికన్ పార్టీ ఓటమి చవిచూసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో రిపబ్లికన్ లీడర్ జార్జ్ అబ్రహం మరోసారి హిందు వ్యతిరేఖ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవల ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్ క్రైస్తవ మతంలోకి మారాలనుకుంటానన్న వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే.
