
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రానున్న రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యువత భవిత కోసం తమ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందన్నారు. నిరుద్యోగులకు నైపుణ్య విద్య అందించడానికి స్కిల్ యునివర్సిటీని ఏర్పాటు చేశామని..ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని చెప్పారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వచ్ఛతా హి సేవ నిర్వహిస్తున్నామని వివరించారు.
గురువారం యూసుఫ్ గూడలో జరిగిన స్వచ్ఛతా హి సేవ కార్యక్రమానికి మంత్రి హాజరై, మాట్లాడారు. ప్రపంచ స్థాయి నైపుణ్యాలను తెలంగాణ యువకుల్లో పెంపొందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మారుస్తున్నామని వివరించారు. ఇందుకు అనుగుణంగా 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో పదేళ్లకుగానూ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు.
జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేయాలి
మంత్రి పొంగులేటికి మాదిగ జేఏసీ వినతిమాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని మాదిగ జేఏసీ కోరింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియేట్లో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జేఏసీ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డా.పిడమర్తి రవి.. జిల్లా యూనిట్ తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేయాలని వినతిపత్రం అందజేశారు.