న్యూఢిల్లీ: పెట్రోకెమికల్ తయారీ కెపాసిటీని పెంచడానికి 2030 నాటికి రూ.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సంస్థ ఆయిల్ అండ్ నేచుల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) భావిస్తోంది. ఈ డబ్బుతో కొత్త మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. మనదేశాన్ని పెట్రోకెమికల్ హబ్గా తీర్చిదిద్దాలన్న కేంద్రం టార్గెట్ను సాధించడానికే ఈ ప్రయత్నమని ఓఎన్జీసీ వర్గాలు తెలిపాయి. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్పీఎల్), దీని జాయింట్ వెంచర్ ఓఎన్జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఓపాల్) ద్వారా ప్రాజెక్టులు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఓఎన్జీసీ అనుబంధ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) పెట్రోకెమికల్ తయారీకి ప్రత్యేకంగా ప్లాన్లను తయారు చేసింది. 2030 నాటికి ఎంఆర్పీఎల్, ఓపాల్ పెట్రోకెమికల్ తయారీ కెపాసిటీ ఏడాదికి ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అంచనా. ఇందుకోసం రెండు మెగా ప్రాజెక్టులను నిర్మిస్తారు. వీటిలో పెట్రోకెమికల్స్ను తయారు చేయడానికి క్రూడ్ను లేదా ఫీడ్స్టాక్స్ను వాడతారు.
పెట్రోకెమికల్కు సంబంధించిన ప్లాన్లు తొలిదశలోనే ఉన్నాయని, వీటి గురించి కంపెనీ బోర్డులో ఇంకా చర్చించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మనదేశంలో 2017-–18, 2021–-22 మధ్య పెట్రోకెమికల్స్ ఉత్పత్తి ఏటా ఐదుశాతం పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ ఆయిల్, గెయిల్, భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోకెమికల్స్ తయారు చేస్తున్న కంపెనీలు.