సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పతనానికి 365 రోజులే మిగిలున్నాయని జోస్యం చెప్పారు. వరంగల్ సభ నేపథ్యంలో ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం ఇతర పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్న అధికారుల పేర్లు డైరీలో రాసి పెడుతున్నా నని, మిత్తి సహా వారికి తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు వాటిని ఉల్లంఘిస్తున్నారని, ఆ ఆఫీసర్లు రిటైర్ అయినా వారిని కోర్టుకు లాగుతామని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ ఖిల్లా అని మరోసారి నిరూపించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో చనిపోయిన రైతుల సాక్షిగా వరంగల్ జిల్లాకు అందరూ కదలిరావాలని అన్నారు. 42 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, ప్రతి బూత్ నుంచి 9 మంది సభకు తరలిరావాలని చెప్పారు.జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని కలిసేందుకు పోటీ పడ్డారు.