హైదరాబాద్:ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు బరితెగించి సామ దాన భేద దండోపాలన్నీ ప్రయోగిస్తున్నారు. అనేక చోట్ల ప్రతిపక్ష బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులపై తమ శ్రేణులను దాడులకు ఉసిగొల్పడం ఉద్రిక్తతకు దారితీసింది. పలుచోట్ల అధికార పార్టీ నేతలు నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయి. ఓటర్లతోపాటు ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపిన చోట్ల వాగ్వాదాలు జరిగాయి. మరోవైపు ప్రతిపక్షాల అభ్యర్థులు తమతో టచ్ లో ఉన్నారని.. తమతో ఒప్పందాలు, రాజీ కుదుర్చుకున్నారన్న ప్రచారాలు గందరగోళం సృష్టించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పోలింగ్ కేంద్రాల సమీపంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు యధేచ్చగా డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెల్లికుదురులో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య తోపులాట
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. నెల్లికుదురులో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో... అక్కడికి వెళ్లారు ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ నేత హుస్సేన్ నాయక్. వీరిని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు అడ్డుకుని... దాడికి యత్నించారు. బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు.
నల్గొండ జిల్లాలోనూ సేమ్ సీన్
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు వినిపించాయి. నల్గొండ పట్టణంలోని ఎంఎన్ఆర్, లక్ష్మి గార్డెన్, బోయవాడల్లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుంటే.. బీజేపీ నేతలు అడ్డుకున్నారు. అటు చౌటుప్పల్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో... పలుచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడగా పోలీసులు చెదరగొట్టారు.