
- వారిలో ఇద్దరు జైషే చీఫ్ మసూద్ అజార్ బామ్మర్దులు
న్యూఢిల్లీ: మన ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ టెర్రర్ గ్రూపులకు చెందిన ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ నెల 7న మన ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వారిలో లష్కరే, జైషే ఉగ్ర సంస్థలకు చెందిన ఐదుగురు కీలక టెర్రరిస్టులు ఉన్నట్టు తాజాగా అధికారులువెల్లడించారు. వీరిలో ఇద్దరు జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్ బామ్మర్దులు ఉన్నట్టు శనివారంతెలిపారు.
హతమైన టెర్రరిస్టులు వీళ్లే..
ముదస్సర్ ఖదాయిన్ ఖాస్: ఇతడు మురిద్కేలోని లష్కరే హెడ్ క్వార్టర్స్ ఇన్చార్జ్. ఇతనికి ముదస్సర్, అబు జుందాల్ అని పేర్లు కూడా ఉన్నాయి. ముదస్సర్ అంత్యక్రియలను పాక్ సైనిక లాంఛనాలతో నిర్వహించారు. హఫీజ్ మహమ్మద్ జమీల్: ఇతడు జైషే చీఫ్ మసూద్ అజార్ పెద్ద బామ్మర్ది. బహవల్పూర్లోని టెర్రరిస్టు క్యాంపుకు హెడ్. యువతను రాడికలైజ్ చేసి, జైషే ఉగ్ర సంస్థలో చేర్పించడంలో కీలక పాత్ర పోషించాడు.మహమ్మద్ యూసుఫ్ అజార్: ఇతడు జైషే చీఫ్ మసూద్ అజార్ చిన్న బామ్మర్ది. ఇతనికి ఉస్తాద్ జీ, మహ్మద్ సలీం, ఘోసీ సాబ్ అనే పేర్లు ఉన్నాయి. జైషే ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించాడు. జమ్మూకాశ్మీర్లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఇతడి హస్తముంది. 1999లో జరిగిన కాందహార్ హైజాక్ కేసులో వాంటెడ్గా ఉన్నాడు.
ఖలీద్ అలియాస్ అబూ అకాషా: ఇతడు లష్కరే కమాండర్. జమ్మూకాశ్మీర్లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఇతడి హస్తముంది. అఫ్గనిస్తాన్ నుంచి వెపన్స్ స్మగ్లింగ్లో కీలక పాత్ర పోషించేవాడు. ఇతడి అంత్యక్రియలకు కూడా పాక్ ఆర్మీ హాజరైంది.