ఆపరేషన్ తెలంగాణ.. 14 సీట్లలో గెలుపే లక్ష్యం

ఆపరేషన్ తెలంగాణ.. 14 సీట్లలో గెలుపే లక్ష్యం
  •   రేపు రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్
  •  వచ్చే నెలలో ప్రియాంక, రాహుల్
  •  కదనరంగంలోకి కాంగ్రెస్ పార్టీ

హైదరాబాద్: తెలంగాణలో 14 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్  పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందుకోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  రేపు (ఆదివారం) హైదరాబాద్ కు వస్తున్నారు. శంషాబాద్ నోవాటెల్ లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కేసీ సమావేశం కానున్నారు. ఈ  సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పాల్గొననున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వేణుగోపాల్ స్థానిక  నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.  

రాష్ట్రంలో తాజా పరిస్థితిని సునీల్ కనుగోలు సమావేశంలో వివరిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఖమ్మం, హైదరాబాద్ మినహా అన్ని సీట్లకు కాంగ్రెస్  పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ సమావేశంలో ఖమ్మం సీటుపైనా పీటముడి వీడుతుందని తెలుస్తోంది. మిగతా స్థానాల్లో ఉన్న ప్రతిబంధకాలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలనే అంశాలపైనే ప్రధానంగా చర్చిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

వచ్చే నెలలో రాహుల్, ప్రియాంక

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎక్కువ లోక్ సభ సీట్లలో పాగా వేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఇక్కడ పార్టీ అగ్రనేతలు భారీ సభలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తుక్కుగూడలో జరిగిన సభకు పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరై మ్యానిఫేస్టో తెలుగు ప్రతిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రెండు  భారీ సభల నిర్వహణకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. 

నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడలో, భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ లో ఒకే రోజు జరిగే ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరవుతారని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. రాహుల్ గాంధీ సైతం రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. దీనికితోడు ఏఐసీసీకి చెందిన ముఖ్యనేతలు ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే మంత్రులు తమకు కేటాయించిన లోక్ సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి సెగ్మెంట్లో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. 

సమీక్షలు, పర్యటనల్లో సీఎం బిజీ

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజీగా మారిపోయారు. పార్లమెంటరీ నియెజకవర్గాల సమీక్షలు నిర్వహించడం.. కీలక నేతల ఇండ్లకు వెళ్లి దిశానిర్దేశం చేయడంలో బిజీగా మారారు. అదే  సమయంలో జాయినింగ్స్ పైనా దృష్టి పెట్టారు. ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కీలక నేతలకు తన నివాసంలో కండువాలు కప్పుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదపడాలని సూచిస్తున్నారు. అంతర్గత సమస్యలపైనా దృష్టి సారిస్తూ కలిసి పనిచేసేలా ఒక్కతాటిపైకి తెస్తున్నారు. ఏది ఏమైనా భారీ మెజార్టీలో 14 సీట్లతో విజయం సాధించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తూ కార్యాచరణలో పెడుతుండటం విశేషం.