న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టూవీలర్స్పై జీఎస్టీ రేటు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలు ఇచ్చారు. ఇదే జరిగితే టూవీలర్ల రే్ట్లు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి. ఆర్ధిక మంత్రి ప్రకటన తరువాత బుధవారం సెషన్లో టూవీలర్ షేర్లు భారీగా లాభపడ్డాయి. హీరో మోటో కార్ప్ ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 6.40 శాతం లాభపడి రూ. 3,159.95 వద్ద క్లోజయ్యింది. టీవీఎస్ మోటార్ 4.88 శాతం, బజాజ్ ఆటో 2.21 శాతం పెరిగాయి. ఇండస్ట్రీ ఈవెంట్లో మాట్లాడుతూ టూవీలర్స్ లగ్జరీ గూడ్స్ కాదని, సిన్ గూడ్స్(ఆల్కహాల్, సిగరెట్స్ వంటివి) కూడా కాదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. టూవీలర్స్పై జీఎస్టీ రేట్లను తగ్గించడం మంచి నిర్ణయం అవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం టూ వీలర్స్ పై 28 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. టూవీలర్స్పై జీఎస్టీ తగ్గిస్తే వీటి అమ్మకాలు పుంజుకుంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
హీరోకు లాభమెక్కువ..
జీఎస్టీ తగ్గితే ఇండియన్ టూవీలర్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్ అయిన హీరో మోటో కార్ప్కు ఎక్కువ లాభం చేకూరనుంది. గ్రామీణ, చిన్న పట్టణాల్లోనూ ఇది బలంగా ఉంది. కరోనా ప్రభావం ఈ ప్రాంతాలలో తక్కువగా ఉండడంతో టూవీలర్ రేట్లు తగ్గితే హీరో అమ్మకాలు పుంజుకుంటాయని విష్లేశకులు అంచనా వేస్తున్నారు. హీరో నెలవారి అమ్మకాలు కూడా పుంజుకుంటున్నాయి. కంపెనీ వేగంగా కరోనా ప్రభావం నుంచి కోలుకుంటోంది. బజాజ్ ఆటో త్రీవీలర్ సెగ్మెంట్లో లీడర్గా ఉండగా, టీవీఎస్ మోటార్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ బాగుంది.