ప్రేమించిందని కన్నబిడ్డనే చంపేశారు

ప్రేమించిందని కన్నబిడ్డనే చంపేశారు

వరంగల్‍/పర్వతగిరి, వెలుగు: వేరే కులం యువకుడిని ప్రేమించిందని అమ్మ, అమ్మమ్మ కలిసి యువతిని హత్య చేశారు. వరంగల్‍ కమిషనరేట్‍ ఈస్ట్​జోన్‍ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన ఉబ్బని సమ్మక్క(38) భర్త చనిపోవడంతో అదే ఊర్లో కూరగాయల వ్యాపారం చేస్తోంది. ఇద్దరు ఆడపిల్లల్లో పెద్ద కూతురు పెళ్లి చేసింది. చిన్న బిడ్డ అంజలి(17) తల్లి దగ్గరే ఉంటూ స్థానిక స్కూల్​లో పదో తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమిస్తోంది. యువకుడు తమకంటే తక్కువ కులం వాడని చెప్పి తల్లితోపాటు అమ్మమ్మ యాకమ్మ(58) ఒప్పుకోలేదు.

ఎంత హెచ్చరించినా అంజలి వినకపోవడంతో గతనెల19న అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో సమ్మక్క, యాకమ్మ కలిసి ఇంట్లో నిద్రిస్తున్న అంజలి ముఖంపై దిండు పెట్టి, గొంతు నులిమి హత్య చేశారు. అంజలి ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని నాటకమాడారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అంజలి తల్లి, అమ్మమ్మలను విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితులు ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 

సిద్దిపేట జిల్లాలో ఏడాది కూతురికి కరెంట్ ​పెట్టి..
దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లాలో ఏడాది కూతురికి కన్న తండ్రే కరెంట్ షాక్​ఇచ్చి చంపాడు. ఇరుగు పొరుగువారు తిట్టడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన రాజశేఖర్, సునీత భార్యాభర్తలు. వీరికి ఏడాది కూతురు ప్రిన్సీ ఉంది. రాజశేఖర్ శుక్రవారం మధ్యాహ్నం కూతురిని ఎత్తుకుని ఆడిస్తూ వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. మోటార్ ​స్టార్టర్ వైరు తీసి ప్రిన్సీ కాళ్లకు షాక్​ ఇచ్చి చంపాడు. అది గమనించిన చుట్టుపక్కల రైతులు రాజశేఖర్​ను తిట్టారు. దీంతో పురుగుల మందు తాగాడు. భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థలతోనే రాజశేఖర్ ​కూతురిని చంపినట్లు తెలుస్తోంది.