అది సర్కారు స్క్రిప్ట్.. అన్నీ అబద్ధాలే : రాష్ట్రపతి ప్రసంగంపై విపక్షాల విమర్శలు

అది సర్కారు స్క్రిప్ట్.. అన్నీ అబద్ధాలే : రాష్ట్రపతి ప్రసంగంపై విపక్షాల విమర్శలు

న్యూఢిల్లీ:  ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం కేంద్ర ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ అని ప్రతిపక్షాల నేతలు విమర్శించారు.  ప్రెసిడెంట్ ప్రసంగం అంతా అబద్ధాలేనని మండిపడ్డారు. 1975 ఎమర్జెన్సీ గురించి రాష్ట్రపతి పదేపదే ప్రస్తావించుడేందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత అపోజిషన్ లీడర్లు పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలు తనను శాశ్వతంగా తిరస్కరించారనే స్థితిలో ప్రధాని మోదీ ఉన్నట్లు అనిపిస్తోందని కాంగ్రెస్ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ ప్రజలు 400 ప్లస్ నినాదాన్ని తిరస్కరించారని, మోదీ అబద్ధాలను తిప్పికొట్టారని పేర్కొన్నారు.

 అందుకే మోదీ లోలోన కుంగిపోతున్నప్పటికీ అలాంటిదేమీ లేదన్నట్లుగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. నీట్ సమస్య పరిష్కారం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్‌‌‌‌లో హింస, జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో టెర్రరిస్ట్ సమస్య, రైలు ప్రమాదాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసీలు.. మైనార్టీలపై  అఘాయిత్యాల గురించి ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌‌‌‌ను ప్రభుత్వం ప్రకటించడాన్ని సమాజ్‌‌‌‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తప్పుబట్టారు. మన దేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థే అయితే, ఇంత మంది యువత ఎందుకు నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.