రాష్ట్రపతి ఎన్నికల్లో దేశ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి పేరును ఖరారు చేసేందుకు ఈ నెల 21వ తేదీన విపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్పవార్ అధ్యక్షత వహించనున్నారు. స్తారు. దాదాపు 17 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
బుధవారం (జూన్ 15న) పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన విపక్షాల సమావేశంలో వచ్చే నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించారు. ఇప్పటికే శరద్ పవార్ను పోటీ చేయాలని విపక్షాలు కోరినా ఆయన నిరాకరించినట్లు తెలిపారు. ఉమ్మడి అభ్యర్థి కోసం ఏకాభిప్రాయ సాధనకు మమతా బెనర్జీ కృషి చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవున్న సందర్భంగా భారత ప్రజాస్వామ్య, సామాజిక వ్యవస్థకు నష్టం కలుగకుండా మోడీ సర్కార్ను నిలువరించడానికి భారత రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండే వ్యక్తిని రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని ఈ భేటీ నిర్ణయించింది.