జీవన్‌‌‌‌దాన్‌‌‌‌ లో గోల్ మాల్.. పలుకుబడి, డబ్బున్నోళ్లకే అవయవ మార్పిడి

జీవన్‌‌‌‌దాన్‌‌‌‌ లో గోల్ మాల్.. పలుకుబడి, డబ్బున్నోళ్లకే అవయవ మార్పిడి

హైదరాబాద్, వెలుగు: జీవన్‌‌‌‌దాన్‌‌‌‌ ప్రోగ్రాంలో అవకతవకలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం వెయిటింగ్‌‌‌‌ లిస్టులో టాప్‌‌‌‌లో ఉన్నవాళ్లను కాదని.. డబ్బులు ఇచ్చినోళ్లకు, రికమండేషన్లు చేయించుకున్నోళ్లకు ఆర్గాన్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌కు సైతం బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన ఎంక్వైరీకి ఆదేశించారు. ప్రయారిటీ లిస్ట్‌‌‌‌లో టాప్‌‌‌‌లో ఉన్నవాళ్లకు గాకుండా, వెనకవాళ్లకు ఎన్ని ఆర్గాన్స్ ఇచ్చారో లెక్క తీయాలని డీఎంఈ రమేశ్‌‌‌‌రెడ్డికి మంత్రి సూచించారు.

ముందున్నోళ్లను తప్పించి..

రాష్ర్టంలో అవయవ మార్పిడి చికిత్సలన్నీ జీవన్‌‌‌‌దాన్‌‌‌‌ ద్వారానే జరుగుతున్నాయి. ఆర్గాన్ కావాలనుకునేవాళ్లు తొలుత జీవన్‌‌‌‌దాన్‌‌‌‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. బ్రెయిన్‌‌‌‌ డెడ్‌‌‌‌ కేసుల్లో, ఆర్గాన్స్ డొనేట్ చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొస్తే, వెయిటింగ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో టాప్‌‌‌‌లో ఉన్నవాళ్లకు ఆ ఆర్గాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లిస్ట్‌‌‌‌లో టాప్‌‌‌‌లో ఉన్న పేషెంట్‌‌‌‌ ఏ హాస్పిటల్‌‌‌‌ ద్వారా ఆర్గాన్‌‌‌‌ కోసం రిజిస్టర్ చేసుకున్నారో, ఆ హాస్పిటల్‌‌‌‌కు జీవన్‌‌‌‌దాన్ వాళ్లు సమాచారం ఇస్తారు. ఆ హాస్పిటల్‌‌‌‌ నుంచి సదరు పేషెంట్‌‌‌‌ లేదా ఆయన కుటుంబ సభ్యులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. పేషెంట్‌‌‌‌ను పిలిపించి, అవసరమైన టెస్టులు చేసి ఆయనకు ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడే కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలు గోల్‌‌‌‌మాల్ చేస్తున్నాయి. టాప్‌‌‌‌లో ఉన్న పేషెంట్‌‌‌‌కు సమాచారం ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూపించి, అధిక డబ్బులు చెల్లించడానికి ముందుకొచ్చినోళ్లకు ఆర్గాన్స్ ఇస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్‌‌‌‌కు పేషెంట్‌‌‌‌ సిద్ధంగా లేరని, ఫోన్లకు రెస్పాండ్ కావడం లేదని సాకులు చూపించి, రికమండేషన్ చేయించుకున్నోళ్లకు ఆర్గాన్స్ ఇస్తున్నట్టు కూడా బాధితులు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

వెయిట్ చేస్తూనే చనిపోతున్నరు

జీవన్‌‌‌‌దాన్‌‌‌‌ ప్రోగ్రాం 2013లో ప్రారంభమైంది. ఇప్పటివరకు దాదాపు3,200 మందికి ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్ చేశారు. ప్రస్తుతం 6,400 మంది రకరకాల ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడేండ్లలో ఇలా ఎదురుచూస్తూనే.. వ్యాధి ముదిరి1,520 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువగా లివర్ పేషెంట్లు,  ఆ తర్వాత కిడ్నీలు, హార్ట్, లంగ్స్ పాడైనోళ్లు ఉన్నారు.

మేమే కాల్స్ చేయిస్తున్నాం

లిస్టులో ముందు ఉన్నవాళ్లకు కాకుండా, వెనకాల ఉన్నవాళ్లకు ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్ జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. కరోనా సమయంలోనే ఇలా జరిగింది. లిస్టులో ముందు ఉన్నవాళ్లు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్‌‌‌‌కు సిద్ధంగా లేకపోవడం, అప్పటికే పేషెంట్ చనిపోవడం వంటి కారణాల వల్ల ఇలా జరిగినట్టు గుర్తించాం. ఆర్గాన్ డోనర్ దొరికినప్పుడు, లిస్టులో ఉన్నవాళ్లకు మా ఆఫీస్ నుంచి కూడా ఫోన్ కాల్స్ చేయిస్తున్నాం. ఇప్పటివరకూ బాధితుల నుంచి మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.

– డాక్టర్ స్వర్ణలత,  ఇన్​చార్జ్, జీవన్‌‌‌‌దాన్‌‌‌‌ ప్రోగ్రాం