ఆదాయం పెంపు దిశగా హెచ్ఎండీఏ.. ఓఆర్ఆర్ లీజుకు ప్లాన్

ఆదాయం పెంపు దిశగా హెచ్ఎండీఏ..  ఓఆర్ఆర్ లీజుకు ప్లాన్

ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల వరకు దీర్ఘకాలిక లీజుకు ఇచ్చి రూ.6నుంచి రూ.7 వేల కోట్లు సమీకరించాలని హెచ్ఎండీఏ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా పబ్లిక ప్రైవేట్ భాగస్వామ్యంతో ఓఆర్ఆర్ (ORR) టోల్, కార్యకలాపాలను, నిర్వహణను చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు లీజుపై ఒప్పందాన్ని అమలు చేయడానికి HGCL బిడ్డర్లను ఆహ్వానించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో లీజు ఒప్పందం ద్వారా దాదాపు రూ.400 కోట్ల ఆదాయం సమకూరింది. కానీ వార్షిక లీజును అమలు చేయడంలో సంస్థకు కొన్ని సవాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. HGCL వచ్చే ఏడాది కాంట్రాక్ట్ కోసం ప్రతి సంవత్సరం ముందుగానే ప్రైవేట్ ఏజెన్సీల నుండి బిడ్‌లను ఆహ్వానించవలసి ఉంటుంది. ఇలా బిడ్డర్ లను ఖరారు చేయడంలో చాలా సమయం తీసుకుంటుండడంతో హెచ్ఎండీఏ ప్లాన్ కు ఛాలెంజింగ్ గా మారింది. 

ఉదాహరణకు కాంట్రాక్ట్ వ్యవధి మార్చిలో ముగిసిపోతే కనీసం 90 రోజుల ముందుగానే అంటే డిసెంబర్ నుండి బిడ్‌లను ఆహ్వానించాలి. ఇది కాకుండా కాంట్రాక్టును పొడిగించాలంటూ వివిధ కారణాలను చూపుతూ కొన్ని ఏజెన్సీలు కోర్టును ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి, HGCL ఇప్పుడు లీజు వ్యవధిని 30 సంవత్సరాలకు పొడిగించాలని నిర్ణయించింది. ‘‘ఇటీవల సమావేశమైన కేబినెట్ 30 ఏళ్ల లీజు కాలానికి ఆమోదం తెలిపింది. ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం జరుగుతోంది ”అని ఓ అధికారి తెలిపారు. వారి సందేహాలను నివృత్తి చేసేందుకు కాబోయే బిడ్డర్‌లతో HGCL ఇప్పటికే ఆన్‌లైన్ ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించింది. కొన్ని ర్యాంప్ టోల్ ప్లాజాల వద్ద, రద్దీ సమయాల్లో ట్రాఫిక్ రద్దీ ఉంటుండడంతో.. టోల్ ప్లాజా వద్ద ర్యాంప్‌ను విస్తరించాలని లేదా టోల్ ప్లాజాల సంఖ్యను పెంచాలని కోరారు. దీంతో అదనపు టోల్‌ లేన్‌ల నిర్మాణానికి ఎక్కడెక్కడ భూమి అందుబాటులో ఉందో అక్కడ భూమిని అందజేస్తామని హెచ్‌జీసీఎల్‌ అధికారులు స్పష్టం చేశారు.