‘ఉత్తమ సినిమా’ కేటగిరి రూల్ లో భారీ మార్పులు.. చేర్పులు
40 ఏండ్ల తర్వాత మారిన రూల్స్
భారతీయులకు ఆస్కార్ ఇక అందని ద్రాక్షేనా?
ఆస్కార్ అనేది సినిమాలో పనిచేసే ప్రతీ ఒక్కరి కల. కానీ, అలాంటి కల ఇక మీదట కొందరికి కలగానే మిగలబోతుందా?. ఎందుకంటే ‘బెస్ట్ పిక్చర్’ కోసం రూల్స్ చాలానే మార్చేసింది ఆస్కార్ అవార్డ్ కమిటీ. వాటి ప్రకారం.. ఇక ముందు అవార్డు అందుకోవడం అంత ఈజీ కాదు. అందుకే అన్ని సినీ ఇండస్ట్రీలు.. ముఖ్యంగా హాలీవుడ్ ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఇంతకీ, ఆస్కార్ కమిటీ మార్చేసిన ఆ రూల్స్ ఏంటి? ఎందుకు మార్చేసింది? ఆ రూల్స్పై ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి?. ఆ వివరాలన్నీ…
కాంట్రవర్సీలకు కేరాఫ్గా మారిన ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియ కొత్త టర్న్ తీసుకుంది. దాదాపు నలభై ఏండ్ల తర్వాత ‘ఉత్తమ చిత్రం’ కేటగిరీకి సంబంధించిన రూల్స్ను మార్చేసింది ఆస్కార్ అవార్డుల కమిటీ. ఆస్కార్కి సెలక్ట్ అయ్యే సినిమాల్లో యాక్టర్స్, టెక్నీషియన్స్లో అన్ని వర్గాల వాళ్లకు ప్రయారిటీ ఉండాలనేదే తమ ఇంటెన్షన్ అని అకాడమీ అవార్డుల కమిటీ చెబుతోంది.‘ఈ మార్పుల వల్ల చాలాకాలం పాటు మూవీ ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని భావిస్తున్నాం’ అని అకాడమీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అయితే ఈ డెసిషన్ వెంటనే అమలు కావట్లేదు. 2025 నుంచి.. అంటే మరో ఐదేళ్ల తర్వాతి ఆస్కార్ వేడుకల నుంచి లెక్కలోకి తీసుకుంటారు. అప్పటి నుంచి ‘బెస్ట్ పిక్చర్’కి నామినేట్ కావాలన్నా.. అవార్డు గెలవాలన్నా కొత్త రూల్స్ను కచ్చితంగా ఫాలో కావాల్సిందే!. అయితే ఈ రూల్స్ కొంచెం డిఫరెంట్గా ఉండడమే అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి అభ్యంతరాలు వెలువెత్తుతున్నాయి.
ఎందుకు మార్చేసిందంటే..
ఆస్కార్ అవార్డుల కోసం ఈ రూల్స్ మార్చేసేందుకు మెయిన్ రీజన్.. అవార్డులు కేవలం వైట్ ఆర్టిస్టులకే ఇస్తున్నారనే ఆరోపణ. ఫిమేల్ ఆర్టిస్టులకు అవార్డులు ఇచ్చే విషయంలో చిన్నచూపు ప్రదర్శిస్తున్నారనే విమర్శ. ఈ రెండు కారణాలతో బెస్ట్ పిక్చర్ కేటగిరీ కోసం రూల్స్ మార్చేశారు. అయితే నాలుగేళ్ల క్రితం దాకా ఈ విషయాల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, #Oscarssowhite క్యాంపెయిన్ షురూ అయినాక.. పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఈ క్యాంపెయిన్ గురించి మాట్లాడక తప్పలేదు. దీనికి తోడు ఈ ఏడాది బాఫ్టా, ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్న నటుడు వాకిన్ ఫినిక్స్.. స్టేజ్ మీదే ఓపెన్గా ఈ క్యాంపెయిన్కి సపోర్ట్గా మాట్లాడాడు. దీంతో అవార్డు కమిటీ వీటి గురించి సీరియస్గా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం.. మీదట ఒక సినిమా తీసేప్పుడు.. అన్ని వర్గాల వారికీ ఆ సినిమాలో ప్రయారిటీ ఉండాలి. అంటే.. రేసిజం, జెండర్.. తేడాలు లేకుండా మినిమమ్ ఆర్టిస్టులు, టెక్నిషియన్లు ఉండేలా చూసుకోవాలి. అలా అయితేనే అది ‘కంప్లీట్ మూవీ’గా భావించి అవార్డు నామినేషన్ కింద తీసుకుంటారు. జ్యూరీల నుంచి ఎక్కువ ఓట్లు పోలైతే.. అవార్డుని ప్రకటిస్తారు.
కొత్త రూల్స్ ఏంటంటే..
జనరల్గా బ్లాక్, బ్రౌన్ ఆర్టిస్టులకు(రేషియల్ అన్రెప్రజెంటెటివ్), డిసెబిలిటీ ఉన్నవాళ్లకు, ఆడవాళ్లు, గే, ట్రాన్స్జెండర్.. ఇతర వర్గాలకు .. సినిమాల్లో తక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఆస్కార్ కొత్త రూల్స్ ప్రకారం.. సినిమాలో వాళ్లకంటూ కొంత కోటా(30 శాతం) కచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే ఆ సినిమాను ఆస్కార్ రేసులోకి తీసుకుంటారు. ముఖ్యంగా నాలుగు కొత్త స్టాండర్డ్ రూల్స్ను తీసుకొచ్చింది అవార్డ్ కమిటీ. దాని ప్రకారం..
కెమెరా ముందు యాక్ట్ చేసేవాళ్లు.
కెమెరా వెనకాల పని చేసే టెక్నిషియన్లు
ఇంటర్న్షిప్తో పని చేసేవాళ్లు
సినిమాను ప్రమోట్ చేసేవాళ్లు..
ఈ నాలుగు మెయిన్ కేటగిరీలలో ఈ కోటాను ఫాలో కావాలి. క్లియర్గా చెప్పాలంటే.. మెయిన్ క్యారెక్టర్ దగ్గరి నుంచి జూనియర్ ఆర్టిస్టుల దాకా, టెక్నిషియన్స్ దగ్గరి నుంచి సినిమాకు పబ్లిసిటీ.. మార్కెటింగ్ చేసేవాళ్ల దాకా అన్నింట్లోనూ కోటా ఉండాలి. రేషియల్ ఎథ్నిక్ గ్రూప్స్ అంటే ఏషియన్, లాటినెక్స్(లాటిన్ దేశాల ఆర్టిస్టులు), బ్లాక్ ఆఫ్రికన్స్, నేటివ్ అలస్కా నేటివ్, నార్త్ ఆఫ్రికన్స్ లాంటి నాన్ వైట్ ఆర్టిస్టులతో పాటు ఉమెన్, ఎల్జీబీటీక్యూ+ వర్గాలు, ఫిజికల్ డిసెబిలిటీ ఉన్నవాళ్లు కూడా ఒక సినిమాలో భాగం కావాలి. ఇండస్ట్రీలో అవకాశాలు అన్నివర్గాల వాళ్లకు దక్కాలనేదే ఈ కొత్త రూల్స్ ఉద్దేశం అని ఆస్కార్ జ్యూరీ టీం ప్రకటించుకుంది.
కాంట్రవర్సీ ఎందుకంటే..
రేసిజం దెబ్బకి ఆస్కార్ అవార్డు జ్యూరీల కమిటీలోనూ మార్పులు మొదలయ్యాయి. రీసెంట్గా 819 కొత్త ఓటింగ్ మెంబర్స్ను తీసుకున్నారు. వీళ్లలో 45 శాతం మంది ఆడవాళ్లు, 36 శాతం నాన్ వైట్ మెంబర్స్ ఉన్నారు. మొత్తం మెంబర్స్ని నాలుగు గ్రూపులుగా చేశారు. రెండు గ్రూపులు మాత్రమే కొత్త రూల్స్కు ఓటేశాయి. సగం మంది సపోర్ట్తో కొత్త మార్పులకు అఫీషియల్గా ఈ జూన్లో స్టాంప్ పడింది. ఈ మేరకు వెయ్యి పదాలతో నాలుగు పేజీల మెమోని రిలీజ్ చేసింది రీసెంట్గా రిలీజ్ చేసింది ఆస్కార్ టీం. దీంతో పలు ఇండస్ట్రీల నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. ‘‘సినిమా అనేది మాకు నచ్చినట్లు తీయాలి అనుకుంటాం. ఆడియెన్స్ని మెప్పించాలని తీస్తాం. కానీ, అవార్డు జ్యూరీలను మెప్పించాలని కాదు. సినిమాకు నప్పిన ఆర్టిస్టులనే తీసుకుంటాం. మాకు నచ్చిన, మాకు అనుకూలంగా ఉన్న టెక్నీషియన్స్తోనే పని చేస్తాం. అవసరం లేకున్నా ఫలానా కేటగిరీ వాళ్లనే తీసుకోవాలనే కండిషన్స్ పెట్టడం కరెక్ట్ కాదు. దానివల్ల మిగతా కేటగిరీ అవార్డులపై ఎఫెక్ట్ పడుతుంది. అయినా అవార్డుల కోసం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం మాకు లేదు” అని హాలీవుడ్ డైరెక్టర్ల అసోషియేషన్ ఒక ఓపెన్ లెటర్ రిలీజ్ చేసింది. ఇతర దేశాల డైరెక్టర్ల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తడంతో అకాడమీ అవార్డుల కమిటీ వెనక్కి తగ్గింది. ఈ నాలిగింటిలో కనీసం రెండు రూల్స్ ఫాలో అయినా చాలు అనే కండిషన్కి అనఫీషియల్గా ఓకే చెప్పంది. అయినా కూడా ఈ వివాదం చల్లారట్లేదు.
కొత్తగా డైవర్సిటీనా?
ఆస్కార్ జ్యూరీ కమిటీ ఈ స్టెప్ స్ట్రాటజికల్గా వేసిందా? లేదంటే ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంటా? అంటూ చాలామంది కొత్త నిర్ణయాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై రెండు వర్గాలుగా చీలిపోయారు. అయితే ‘డైవర్సిటీ రూల్స్’ పేరుతో అకాడమీ జ్యూరీ పెంట చేస్తోందనేది చాలామంది ఆరోపిస్తున్నారు. టీవీ లెజెండ్, నటి క్రిస్ట్రి అల్లె ఏకంగా ట్విట్టర్ సాక్షిగా జ్యూరీ మెంబర్స్పై బూతు పురాణం అందుకుంది. ఆ తర్వాత ఎందుకనో ఆ ట్వీట్లను డిలీట్ చేసినప్పటికీ.. ఆ నిర్ణయాన్ని మాత్రం తప్పుబడుతున్నట్లు చెప్పింది. అయితే ఈ కొత్త రూల్స్ నిజంగా అమలు అవుతాయా?, ఒకవేళ అయినా ఎక్కువ కాలం సాగుతుందా? అంటే కాదు అనే అంటున్నారు కొందరు. క్రిటిసిజం నుంచి తప్పించుకునేందుకు.. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా చేస్తున్నారని, అవార్డుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని చెప్తున్నారు.
‘‘ఇండస్ట్రీలో బ్లాక్ ఆర్టిస్టులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఆర్టిస్టులు, డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లు.. ఇలా అన్ని క్రాఫ్ట్స్లోనూ ఫిమేల్ డామినేషన్ పెరిగిపోతున్న రోజులివి. పైగా జెండర్ బేస్డ్ సినిమాల గురించి ఆడియెన్స్ చర్చించుకుంటున్న కాలం ఇది. అలాంటప్పుడు కేవలం అవార్డుల కోసమే ఎవరూ సినిమాలు తీయరు. ఇక ఫిమేల్ టెక్నిషియన్లకు అవార్డులు దక్కకపోవడం అంటే వాళ్లు అంత ఎఫర్ట్ పెట్టకపోవడమే కారణం అయి ఉండొచ్చు. ఇంత జరుగుతున్నప్పుడు అవార్డుల జ్యూరీలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక స్టుపిడ్ స్టెప్” అని ఫిక్షన్ సినిమాలతో మన దేశంలోనూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ అంటున్నాడు. గత నాలుగైదు సంవత్సరాలు బెస్ట్ పిక్చర్ అవార్డులు గెల్చుకున్న సినిమాలన్నీ ఈ రూల్స్ లేకున్నా అవార్డులు గెల్చుకున్నవే. అన్నీ క్రిటిక్స్, ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందుకున్నవే. అలాంటప్పుడు కొత్తగా ఈ డైవర్సిటీ రూల్స్ అవసరంలేదని చాలామంది చెప్తున్నమాట. కేవలం కొంతమందిని ఇంప్రెస్ చేయడానికే ఆస్కార్ అవార్డుల కమిటీ ఈ ఛేంజ్ పాలసీని తీసుకొచ్చిందని వాళ్లు అంటున్నారు. ఈ కొత్త డైవర్సిటీ రూల్స్ ఎఫెక్ట్ ఏపాటిదో తెలియాలంటే.. వచ్చే ఏడాది (ఏప్రిల్ 25, 2021) జరగబోయే ఆస్కార్ వేడుకల దాకా ఎదురు చూడాల్సిందే!.
ఆస్కార్ ఆవార్డుల వేడుకకు ముఖ్యమైన అవార్డు కేటగిరీ ‘‘బెస్ట్ పిక్చర్’’. ఈ కేటగిరీకి సెలక్ట్ అయిన సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. అది కూడా కొన్నేండ్ల తరబడి. అందుకే ఆ కేటగిరీ మీద ప్రతి దర్శకుడికి ఒక గురి ఉంటుంది. కానీ, ఇక ముందట ఏ సినిమాకి పడితే ఆ సినిమాకి ఈ అవార్డు దక్కే ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ అవార్డుల్ని సెలక్ట్ చేసే కమిటీ ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ కొన్ని రూల్స్ మార్చేసింది. ఆ రూల్స్ను ఫాలో అయ్యే సినిమాలనే నామినేషన్స్గా తీసుకుంటామని, అవార్డులు ఇస్తామని అనౌన్స్ చేసింది. దీంతో లొల్లి షురూ అయ్యింది.
అవార్డు.. లెక్కేకాదు
హల్లె బెర్రీ.. ఆస్కార్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గెల్చుకున్న తొలి ఆఫ్రో అమెరికన్. 2002లో ‘మాంస్టర్స్ బాల్’ సినిమాకు ఈమెకి అవార్డు వచ్చింది. ఆ టైంలో తన కెరీర్ పీక్స్కి చేరుకుందని ఫీలైందామె. కానీ, అక్కడి నుంచి ఆమె కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఆస్కార్ కొత్త రూల్స్ రిలీజ్ అయిన రోజే ఆమె బ్లాక్, ఫిమేల్ ఆర్టిస్టులకు ఆస్కార్ దక్కకపోవడంపై ఓ మేగజిన్ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యింది. ‘‘ఆస్కార్ రావడంతో నా ఫేట్ మారిపోయింది అనుకున్నా. బడా దర్శకులు, ఫిల్మ్ మేకర్స్ అవకాశాలతో నా ఇంటి తలుపు కొడతారని కలలు కన్నా. కానీ, అది జరగలేదు. పైగా దారుణమైన డిజాస్టర్లు నాకొచ్చాయి. ఇదంతా ఆస్కార్ తెచ్చిన శాపమన్నారు కొందరు. అవార్డులిచ్చే ఫర్ఫార్మెన్స్ చేయమని మరికొందరు సలహాలు కూడా ఇచ్చారు. కానీ, మార్పు నా నటనలో రాలేదు. ముక్కు ముఖం తెలియని వాళ్లకు, తెల్ల తోలు ఉన్నవాళ్లకే అవార్డులు ఇస్తారనే విషయం అప్పుడే మెల్లిగా అర్థమైంది నాకు. అందుకే అవార్డుల్ని ప్రామాణికంగా తీసుకోవడం మానేశా నేను. ఆర్టిస్టులు అనే వాళ్లు మంచి అవకాశాల కోసమే చూడాలి తప్ప.. అవార్డుల కోసం కాదనేది నా అభిప్రాయం” – హాల్లె బెర్రీ, నటి
మొదటి అడుగు మీదే కావాలి
నా పర్ఫార్మెన్స్కి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ, నా తోటి ఆర్టిస్టులు నాన్ వైట్ అయినందుకు అవార్డు ఇవ్వకపోవడం బాధగా అనిపిస్తోంది. జ్యూరీ వాళ్లు ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తే బాగుండేది. ఇప్పుడుం మనం అసలు ఎక్కడ ఉన్నామో ఒకసారి చూద్దాం. ఇలాంటి వేడుకలకు నాన్ వైట్ ఆర్టిస్టుల్ని పిలవం. వాళ్లకు అసలు ఇక్కడ చోటే ఇవ్వం. ఇలా మనం వాళ్లను గౌరవించుకోబోమనే సంకేతాల్ని ప్రజలకు పంపిస్తున్నాం. ఒక సినిమాను బతికించేది ఆడియెన్స్. టాలెంట్ ఉన్న ప్రతీ ఆర్టిస్టుకి గౌరవం దక్కాలనే కోరుకుంటారు ఆడియెన్స్. కానీ, ఇక్కడ జరుగుతోంది ఏంటి?. శ్రమకు తగిన గుర్తింపు దక్కట్లేదు. నాకు దక్కిన గౌరవం.. నా తోటి ఆర్టిస్టులకు ఎందుకు తగ్గట్లేదని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నా. ఒకరకంగా ఈ సమస్యలో నేను ఒక భాగం అయినందుకు సిగ్గు పడుతున్నా. సినీ ఇండస్ట్రీలో రేసిజం ఒక క్రమపద్ధతిలో పేరుకుపోతోంది. దీనిని రూపుమాపేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. అందుకు అవార్డులిచ్చే జ్యూరీలే మొదటి అడుగు వేయాలి. 2019లో అవార్డు అందుకుంటూ హాలీవుడ్ నటుడు వాకిన్ ఫినిక్స్ అన్నమాటలివి.