
- 20 తులాల గోల్డ్ రూ.13.50 లక్షల సొత్తు స్వాధీనం
ఓయూ, వెలుగు : రెక్కీ వేసి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఓయూ డివిజన్ఏసీపీ సదయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా తుమ్ముకుంట పరిధి నాగర్లబండ తండాకు చెందిన రత్లావత్శంకర్నాయక్ అలియాస్ రాజేశ్రెడ్డి అలియాస్ రంగారావు అలియాస్ లియాజ్ఖాన్(28) గద్వాల్లో బీ-ఫార్మసీ చదివాడు. జులాయిగా తిరిగే శంకర్నాయక్2012లో గద్వాల్లో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లాడు.
విడుదలై వచ్చాక చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. పగటిపూట కాలనీల్లో రెక్కి వేసేవాడు. రాత్రి పూట టార్గెట్ చేసిన ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేసి నగలు, నగదు ఎత్తుకెళ్లేవాడు. రాష్ట్రంతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. గత అక్టోబర్ లో హబ్సిగూడలో ఉండే రాజు తన ఫ్యామిలీతో కలిసి సొంతూరు జనగామకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా నగలు, నగదు, యూఎస్ డాలర్లు కనిపించలేదు.
దీంతో బాధితుడు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించారు. నిందితుడు పలుమార్లు బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. అతడిపై నిఘా పెట్టి సిటీలోని అన్ని పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. బుధవారం నిందితుడుతన బైక్ పై అమీర్పేట్లో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు అనుమానంతో ఆపి అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలు చేసినట్టు అంగీకరించారు. నిందితుడి వద్ద సుమారు రూ. 13.50 లక్షల విలువైన 20 తులాల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శంకర్ నాయక్ పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ సదయ్య తెలిపారు.