హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా జులై 20,21న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రకటించింది. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం రెండు రోజులు సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
అంతకుముందు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్లో 'రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని నిర్ణయించింది' అని ట్వీట్చేశారు.
ఈ ప్రకటన తర్వాత, ఓయూ పరీక్షలను వాయిదా వేసింది. త్వరలోనే వీటి రీషెడ్యూల్ డేట్ అనౌన్స్ చేస్తామని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా పరీక్షలను వాయిదా వేసింది. రీషెడ్యూల్ చేసిన పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు పరీక్షల నిర్వహణ తేదీలపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. జూలై 24 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ప్రజలకు సూచించారు.