నోటిఫికేషన్ విడుదల చేసిన ఓయూ

నోటిఫికేషన్ విడుదల చేసిన ఓయూ

హైదరాబాద్, వెలుగు: నిజాం కాలేజ్ హాస్టల్ సదుపాయం కోసం ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 19న ఫైనల్ లిస్ట్‌‌ విడదుల చేస్తామని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ భీమా నాయక్ తెలిపారు. విద్యా శాఖ మంత్రి ఆదేశాల ప్రకారం యూజీకి సగం, పీజీకి సగం హాస్టల్  కేటాయిస్తామన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని డిగ్రీ విద్యార్థులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. 50 శాతం హాస్టల్ వసతికి తాము ఒప్పుకోబోమన్నారు. సగం సగం అని చెప్పి అప్లికేషన్‌‌లో తమకు అనేక రకాల కండీషన్లు పెట్టారని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు లేనివారు, సింగిల్ పేరెంట్ ఉన్నవారు, గత సెమ్‌‌లలో మంచిగా స్కోర్ చేసిన మెరిట్ స్టూడెంట్లు అప్లై చేసుకోవాలనే నియమాలు పెడితే  కనీసం పది శాతం మందికి కూడా హాస్టల్ వసతి దొరకదని అంటున్నారు. పీజీ విద్యార్థులకు ఎటువంటి కండీషన్లు లేవన్నారు. పూర్తి హాస్టల్ ని తమకు కేటాయించే వరకు నిరసన ఆపబోమని చెప్తున్నారు. సోమవారం నుంచి బ్యాగ్‌‌లు, లగేజ్‌‌లు పట్టుకుని కాలేజ్‌‌లోనే 24 గంటల నిరసన చేస్తామని హెచ్చరించారు.