హైదరాబాద్, వెలుగు: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మల్లఖంబ్ చాంపియన్షిప్లో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎస్. రాహుల్ సత్తా చాటాడు. తమిళనాడులోని చంగల్పట్టులో జరిగిన ఈ టోర్నీలో ఉస్మానియా యూనివర్సిటీ జట్టు తరఫున బరిలోకి దిగి పిరమిడ్ మల్లఖంబ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.
రాహుల్ సహా ఆరుగురు సభ్యులతో కూడిన ఉస్మానియా జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఓయూ తరఫున నెగ్గిన ఈ పతకంతో అంబేద్కర్ కాలేజీకి మంచి పేరు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని రాహుల్ అన్నాడు. విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజ వివేకానంద్, మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ సపోర్టుతో ఫ్యూచర్లో మరింత సత్తా చాటుతానని చెప్పాడు.
