
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనున్న పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు ఒక్క నిమిషం నిబంధన అమలు చేయనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్రవీందర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఐదేళ్ల తరువాత వర్సిటీ, పీహెచ్డీ ఎంట్రెన్స్ నిర్వహిస్తోందని తెలిపారు. డిసెంబర్1నుంచి 3 వరకు జరుగనున్న పరీక్షలు..రోజుకు 3 దఫాలుగా నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షకు 47 సబ్జెక్టుల్లో 9,776 మంది హాజరు కానున్నట్లు వివరించారు.
సెంటర్కు గంట ముందే చేరుకోవాలని ఒక్క నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. అత్యధికంగా కామర్స్ ఫ్యాకల్టీలో 841 మంది దరఖాస్తు చేసుకోగా.. పర్షియన్ సబ్జెక్టులో నలుగురు మాత్రమే పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. ఓయూ వెబ్ సైట్ ద్వారా శనివారం నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్చేసుకోవచ్చన్నారు. ఇటీవల వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపైనా వీసీ స్పందించారు. కొంతమంది విద్యార్థులు కావాలనే గొడవలకు దిగుతూ, వర్సిటీ అధికారులపై దాడులు చేస్తున్నారని, ఇలాంటి వాటిని సహించేది లేదని అన్నారు. యూజిసీ నిబంధనల ప్రకారమే కొత్త క్రెడిట్స్ నిర్ణయించినట్లు చెప్పారు.