టెక్సాస్: హెచ్-1బీ వీసా దరఖాస్తులపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని టెక్సాస్ రాష్ట్ర సంస్థలు, విశ్వవిద్యాలయాలకు టెక్సాస్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. టెక్సాస్ వర్క్ఫోర్స్ కమిషన్ నుంచి వ్రాతపూర్వక అనుమతి లేకుండా కొత్త H-1B పిటిషన్లను దాఖలు చేయడాన్ని నిలిపివేయాలని రాష్ట్ర సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించారు.
టెక్సాస్ గవర్నర్ ఆదేశాల ప్రకారం.. ఈ నిర్ణయం జనవరి 27, 2026 నుంచి అమలులోకి వచ్చింది. మే 31, 2027 వరకు అమలులో ఉంటుంది. H-1B వీసా దుర్వినియోగం అవుతుందని.. అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని గ్రెగ్ అబాట్ కుండబద్దలు కొట్టారు.
హెచ్1బీ వీసా రెన్యువల్ కోసం అప్లయ్ చేసుకున్నవాళ్లకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికే రెగ్యులర్ వీసా అప్లికేషన్ల ఇంటర్వ్యూలకు వెయిటింగ్ పీరియడ్ ఏడాది వరకు ఉండగా, తాజా పరిణామాలతో హెచ్1బీ వీసా రెన్యువల్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్ కోసం 2027 దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలోని యూఎస్ కాన్సులేట్లలో పేరుకుపోయిన అప్లికేషన్ల బ్యాక్లాగ్లే ఇందుకు కారణమైంది.
వీసా రెన్యువల్ కోసం భారత్కు వచ్చి అమెరికాకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న టెకీలపై దీని ప్రభావం తీవ్రంగా పడుతోంది. సమస్య ఇప్పటిలో తగ్గే అవకాశం లేదు కాబట్టి, అమెరికాలో హెచ్1బీ వీసాతో ఉన్నవాళ్లు వీసా స్టాంపింగ్ కోసం భారత్కు వెళ్లొద్దని ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన కొందరి ఇంటర్వ్యూలు ఇప్పటికే రద్దయ్యాయని, జనవరి.. ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఉన్నవాళ్లకు కూడా తేదీలు మార్చి ఏడాది తర్వాత 2027లో కేటాయిస్తూ మెయిల్స్ పంపుతున్నారని చెప్తున్నారు.
