- వెండి కిలో ధర రూ. 3.70 లక్షలు
- పది గ్రాములకు రూ.1.66 లక్షలు
- కెనడాపై ట్రంప్ 100% సుంకాలు
- విధిస్తామనడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్టానికి చేరాయి. ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ వల్ల కిలో వెండి ధర మంగళవారం (జనవరి 27) ఏకంగా రూ.40,500 పెరిగి రూ.3.70 లక్షలకు చేరింది. పది గ్రాముల బంగారం (99.9 స్వచ్ఛత) ధర రూ.7,300 ఎగిసి రూ.1.66 లక్షలు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్, భౌగోళిక ఉద్రిక్తతలు ధరల పెరుగుదలకు కారణం.
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించడం పెట్టుబడిదారులలో ఆందోళన పెంచింది. దక్షిణ కొరియా వాహనాలపై, మందులపై యూఎస్ 25 శాతం పన్నులు పెంచడంతో బంగారం, వెండికి గిరాకీ పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు ధర 5,087.48 డాలర్లు, వెండి 112.41 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
ఆసియా, యూరప్ దేశాలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఇకముందు స్వల్ప లాభాల స్వీకరణ జరిగినా, ధరలు బాగానే ఉంటాయని ఉంటాయని లెమన్ మార్కెట్స్ డెస్క్ ఎనలిస్ట్ గౌరవ్ గార్గ్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ విధానాల్లోని అస్పష్టత ఈ ఏడాది ధరలను శాసిస్తోందని ఆగ్మాంట్ ప్రతినిధి రెనిషా చైనానీ పేర్కొన్నారు.
