నా జీవితంలో ఇంత గలీజు రాజకీయాలు చూడలే

నా జీవితంలో ఇంత గలీజు రాజకీయాలు చూడలే

మునుగోడు (నల్గొండ జిల్లా): త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘‘మునుగోడులో మా లక్ష్యం 76వేల ఓట్లు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని గెలిపించుకుంటాం’’ అని చెప్పారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. 

సీఎం కేసీఅర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ ఉత్తమ్ విమర్శించారు. ఇన్నాళ్ల తన రాజకీయ జీవితంలో ఇంత గలీజు రాజకీయాలు చూడలేదన్నారు. ఎనిమిదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మునుగోడు అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. గత ఎన్నికలలో బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయో, ఇప్పుడూ అన్నే పడతాయని జోస్యం చెప్పారు. మతతత్వ బీజేపీ, అవినీతిమయ టీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.