
- ముషీరాబాద్ సర్కిల్ ఆఫీసులో పెట్రోల్ పోసుకుని వ్యక్తి నిరసన
- రంగారెడ్డి కలెక్టరేట్ లో కలెక్టర్ కు గోడు వెళ్లబోసుకున్న మహిళ
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 88 ఫిర్యాదులు రాగా అత్యధికంగా హౌసింగ్, లేక్స్ విభాగానికి 43, టౌన్ ప్లానింగ్ 23 వచ్చాయి. ఆరు జోన్లలో మొత్తం 89 ఫిర్యాదులు వచ్చాయి. కూకట్పల్లి జోన్ లో 42, శేరిలింగంపల్లి జోన్ లో 16, సికింద్రాబాద్ జోన్ లో 14, ఎల్బీనగర్ జోన్లో 9, చార్మినార్ జోన్ లో 6, ఖైరతాబాద్ జోన్లో 2 ఫిర్యాదులు అందాయి. హెడ్డాఫీసు ప్రజావాణిలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతరెడ్డి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.
ప్రజావాణిలో రాంనగర్కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి తన శరీరంపై పెట్రోల్ పోసుకుని హల్చల్ చేశాడు. తాత ఆస్తి విషయంలో రావాల్సిన వాటా ఇవ్వకుండా తన మామా అక్రమంగా ఇళ్లు కడుతున్నాడని ముషీరాబాద్ సర్కిల్ ఆఫీసులో కంప్లైంట్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ముషీరాబాద్ డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఏసీసీలు లంచం తీసుకొని తనకు అన్యాయం చేస్తున్నారని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాడు. పెట్రోల్ పోసుకున్న అనిల్ ను అడ్డుకున్న పోలీసులు విజిలెన్స్ అధికారులు అక్కడి నుంచి తరలించారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో అనిల్ వెళ్లిపోయాడు.
మా ప్రమేయం లేకుండా..
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూర్ గ్రామానికి చెందిన కొట్టం యాదమ్మకు ఆరుట్ల రెవెన్యూ గ్రామంలో వివిధ సర్వే నంబర్లలో మొత్తం 9 ఎకరాల భూమి ఉంది. యాదమ్మ ఎలాంటి భూమి విక్రయించకున్న ఒక్కసారిగా 3.29 ఎకరాల భూమి ఇటీవల ధరణిలో మార్పిడి చేశారు. మంచాల ఎమ్మార్వో ఆఫీసులో సంప్రదిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని, భూమి ఇతరుల పేరుపై మార్చడంపై కలెక్టర్ ఎదుట యాదమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.