దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగరా మోగింది. లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడిన దాదాపు రెండు వారాల్లోనే భారత ఎన్నికల సంఘానికి చెందిన సీ విజిల్ యాప్ మొబైల్ యాప్కి 79 వేల పైగా ఫిర్యాదులు అందాయి. అయితే ఇందులో 99% కేసులు పరిష్కరించబడ్డాయి. అక్రమ హోర్డింగ్లు, బ్యానర్లకు వ్యతిరేకంగా 58 వేల 500 ఫిర్యాదులు (73%) అందాయని ఈసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
డబ్బు, బహుమతులు, మద్యం పంపిణీకి సంబంధించి 1,400 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయని వెల్లడించింది ఈసీ. ఆయుధాలు చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన 535 ఫిర్యాదుల్లో 529 ఇప్పటికే పరిష్కరించబడ్డాయని చెప్పింది. వచ్చిన 99% ఫిర్యాదులను పరిష్కరించినట్లు పోల్ బాడీ తెలిపింది. అలాగే, ఈ ఫిర్యాదులలో దాదాపు 89% 100 నిమిషాల్లో పరిష్కరించబడ్డాయని స్పష్టం చేసింది.
2018 జూలైలో ఈ యాప్ ప్రారంభించింది ఈసీ. ఎన్నికల అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సీ విజిల్ యాప్ను తీసుకువచ్చింది. దీని ద్వారా దేశంలో ఏ మూలన ఉన్న పౌరుడు అయినా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఈ ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో ఎన్నికల సంఘం అధికారులు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలు, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను రిపోర్ట్ చేయాడానికి ఈ యాప్ను ఉపయోగించుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పౌరులను కోరినట్లు కూడా ఈసీ తెలిపింది