
- 8 నెలల్లో ఎన్ఎస్ఈలో కోటి మంది జాయిన్
- 8 కోట్లకు మొత్తం ఇన్వెస్టర్లు
ముంబై : ఎనిమిది నెలల కాలంలో కోటి మంది కొత్త ఇన్వెస్టర్లు ఎన్ఎస్ఈ ప్లాట్ఫామ్పై జాయినయ్యారు. ఈ కోటి మందితో మొత్తం ఇన్వెస్టర్ల మార్కు 8 కోట్లకు చేరిందని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (ఎన్ఎస్ఈ) ప్రకటించింది. టాప్ టైర్ సిటీల నుంచే కాకుండా, చిన్న పట్టణాలకు చెందిన ఇన్వెస్టర్లు సైతం ఈ కొత్త ఇన్వెస్టర్లలో ఉన్నట్లు వెల్లడించింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 45 శాతం మంది టాప్ 100 సిటీలకు బయట వారే కావడం విశేషమని పేర్కొంది. ఎనిమిది కోట్ల యూనిక్ పాన్కార్డులూ 5 కోట్ల యూనిక్ హౌస్హోల్డ్స్కి చెందినవని వివరించింది. ఇది దేశంలోని హౌస్హోల్డ్స్లో 17 శాతానికి సమానమని తెలిపింది. అంటే, వారు మన స్టాక్ మార్కెట్లో నేరుగా పెడుతున్నవారని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ ట్రేడింగ్ మెంబర్ల నెట్వర్క్ ద్వారా ఈ ఇన్వెస్టర్ల మార్కును అందుకున్నామని ఎన్ఎస్ఈ వివరించింది. తమ వద్ద మొత్తం యూనిక్ క్లయింట్ కోడ్ అకౌంట్లు 14.9 కోట్లని వెల్లడించింది.
కొంత మంది ఇన్వెస్టర్లు ఒక ట్రేడింగ్ మెంబర్ కంటే ఎక్కువ మంది వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుందని పేర్కొంది. కొత్తగా వచ్చి చేరిన కోటి మంది ఇన్వెస్టర్లలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి 43 శాతం, పశ్చిమ రాష్ట్రాల నుంచి 27 శాతం, దక్షిణాది రాష్ట్రాల నుంచి 17 శాతం, తూర్పు రాష్ట్రాల నుంచి 13 శాతం మంది ఉన్నట్లు వివరించింది. క్యాపిటల్ మార్కెట్ జోరుగా ఉన్నదనే అంశాన్ని ఈ కొత్త ఇన్వెస్టర్ల సంఖ్య ప్రతిఫలిస్తుందని తెలిపింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 76 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు వెల్లడించింది.