
నార్త్ వెస్ట్రన్ కాంగోలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో సుమారు 107 మంది చనిపోగా, 146 మంది గల్లంతయ్యారు. దాదాపు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవ గురువారం ఈక్వేటర్ ప్రావిన్స్లో కాంగో నదిపై మంటల్లో చిక్కుకుని బోల్తా పడిందని కాంగో మంత్రిత్వ శాఖ తెలిపింది.
అదే ప్రావిన్స్లో మరో ఘోర ప్రమాదం జరిగిన తరువాత రోజే ఈ విషాదం చోటుచేసుకుంది. బుధవారం బసంకుసులో జరిగిన పడవ ప్రమాదంలో 86 మంది ప్రాణాలు కోల్పోగా, చాల మంది వాళ్ళు గల్లంతయ్యారు. వరుసగా సంభవించిన ఈ విపత్తుల కారణంగా వారం రోజుల్లోనే మొత్తం మరణాల సంఖ్య దాదాపు 200కు చేరుకుంది.
ఇప్పటికి ఈ ప్రమాదాలకు కారణాలు తెలియకపోగా, అక్కడి రాష్ట్ర మీడియా బుధవారం జరిగిన ప్రమాదానికి రాత్రి సమయంలో నావిగేషన్ సరిగ్గా లేకపోవడం కారణమని పేర్కొంది.
ఈ వరుస ఘటనలతో అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ విపత్తుకు ప్రభుత్వమే కారణమని, మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందించలేదు.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి, ఇక్కడ మౌలిక సదుపాయాలు సరిగా అలాగే రోడ్లు లేకపోవడం వల్ల చాలా మంది రవాణా కోసం చెక్క పడవలపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ పడవలు శిథిలావస్థకు చేరుకోవడం, లైఫ్ జాకెట్లు వంటి ప్రాథమిక భద్రతా చర్యలు లేకపోవడం, ఎక్కువగా రాత్రిపూట ప్రయాణించడం ఇవన్నీ రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకం కలిగిస్తున్నాయి.