గుండెపోటుతో నేత కార్మికుడు మృతి
తంగళ్లపల్లి, వెలుగు: గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి శవాన్ని ఇంటిలోకి తేవడానికి వీల్లేదని హౌజ్ఓనర్ అభ్యంతరం చెప్పాడు. దహనానికి కూడా డబ్బులు లేని నిరుపేద చేనేత కార్మికుడి కుటుంబం ఆ శ్మశానవాటికలోని చెట్టుకింద ఉంచింది. ఇది తెలిసిన దాతలు ముందుకువచ్చి అంతిమసంస్కారం చేయించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో చోటుచేసుకుంది. మహరాష్ట్రకు చెందిన కొమిలేకర్ రాజు కుటుంబం బతుకుదెరువు కోసం నాలుగేండ్ల కింద ఇక్కడకు వచ్చింది. రాజు టైక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా రాజు ఆరోగ్యం దెబ్బతినగా చాలా హాస్పిటల్లలో చూపించారు.
అతని వైద్యానికి చాలా ఖర్చు చేశారు. ఆదివారం తీవ్రఅనారోగ్యానికి గురికాగా సిరిసిల్లలోని ఏరియా హస్పిటల్కు తీసుకెళ్లారు. అదేరాత్రి గుండెపోటుతో చనిపోయాడు. ఇంటి యజమాని మృతదేహన్ని ఇంట్లోకి రానివ్వక పోవడంతో శ్మశానవాటికకు తీసుకెళ్లారు. ఏడుస్తూ కూర్చున్న రాజు భార్యపిల్లలను చూసిన కొందరు ముందుకొచ్చి దహన సంస్కారాలకోసం డబ్బులు ఇచ్చారు. రాజు కుటుంబాన్ని ఆదుకుంటామని దాతలు భరోసానిచ్చారు.