
పీపుల్స్ ప్లాజాలో18 నుంచి మేళా షురు
హైదరాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇప్పుడు మొక్కలు నాటడం అంటే.. రాబోయే తరాలకు ఆక్సిజన్ అందించడమేనని తెలిపారు. గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్లో 12వ గ్రాండ్ నర్సరీ మేళా బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 18 నుంచి ఆలిండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో ప్రారంభం అవుతుందని తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ షోలో వివిధ రకాల మొక్కలతో పాటు హార్టికల్చర్, అగ్రికల్చర్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఆర్గానిక్ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని తెలిపారు. అగ్రికల్చర్ లో ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇండస్ట్రీ ఉత్పత్తులు ఎగ్జిబిట్ చేస్తారని చెప్పారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఎమర్జింగ్ టెక్నాలజీ, హైడ్రోఫోనిక్ సిస్టమ్, వర్టికల్గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్ ఈ షోలో ప్రదర్శిస్తారని తెలిపారు.
కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగుళూరు, పుణే, షిర్డీ, చెన్నై, డార్జిలింగ్, తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్ 120కు పైగా స్టాల్స్లో ప్రదర్శిస్తారని తెలిపారు. ఇంపోర్టెడ్ ప్లాంట్స్, ఔట్డోర్, బల్బ్, సీడ్, సీడ్ లింక్స్ ,ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. నెక్లెస్ రోడ్ లో 22వ తేదీ దాకా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అందుబాటులో ఉంటాయని, రూ.50 నుంచి రూ.3లక్షల వరకు ఖరీదు చేసే మొక్కలు లభిస్తాయని మేళా ఇన్చార్జ్ ఖాలీద్ అహ్మద్ తెలిపారు. మేళాను మంత్రులు హరీశ్రావు, నిరంజన్ రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ప్రారంభిస్తారని వివరించారు.