మోరంచపల్లి, కొండాయి గ్రామాలు నీటమునిగి తీవ్ర ఆస్తినష్టం
సీఎస్తో కేంద్ర ప్రతినిధి బృందం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర బృందం పేర్కొంది. వరి పంటతోపాటు పత్తి పంట పూర్తిగా ధ్వంసమైనట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సీఎస్ శాంతి కుమారితో సమావేశమైంది. కేంద్ర బృందంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గురువారం సీఎస్తో చర్చించారు.
ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి మాట్లాడుతూ ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలు పూర్తిగా నీటమునిగి తీవ్ర ఆస్తి నష్టం జరిగిందన్నారు. విపత్తుల నివారణకు కేంద్ర ప్రతినిధి బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని సీఎస్శాంతి కుమారి తెలిపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది.