హుజూరాబాద్ అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్లో చేరాల్సిందేనని తన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ సమక్షంలో బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని కౌశిక్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరిన కౌశిక్.. నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదేనన్నారు. కేసీఆర్ ఎవరిని నిలబెట్టినా గెలిపించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. తాము అభివృద్ధి చేయకపోతే టీఆర్ఎస్కు మళ్లీ ఓటు వేయొద్దన్నారు.
‘టీఆర్ఎస్కు ఒక చాన్స్ ఇవ్వాలని హుజూరాబాద్ ప్రజలను కోరుతున్నాం. మేం చెప్పినట్లుగా అభివృద్ధి చేయలేకపోతే మళ్లీ టీఆర్ఎస్కు ఓటెయ్యొద్దు. ఆర్థిక మంత్రిగా ఉండి ఈటల రాజేందర్ ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఈటల మా కార్యకర్తలను చంపించిండు. ఆయనను చంపాల్సిన అవసరం మాకు లేదు. ఈటలది హత్యా రాజకీయాలు చేసిన చరిత్ర. మాజీ ఎంపీటీసీ బాలరాజును రాజేందర్ చంపించిండు. 2018లో నన్ను చంపిచేందుకు కూడా ప్రయత్నం చేసిండు. అవినీతి ఆరోపణలతోనే ఆయన రాజీనామా చేసిండు. ఇప్పుడు ఆత్మగౌరవం అనడం సరికాదు. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ను గెలిపించాలి. ఇక నుంచి నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటా’ అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.