
శ్రీనగర్: దాయాది పాకిస్తాన్ దేశం మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. మంగళవారం (ఆగస్ట్ 5) రాత్రి పూంచ్ సెక్టార్లోని ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ సైన్యం షెల్లింగ్ మొదలుపెట్టడంతో భారత ఆర్మీ వెంటనే అప్రమత్తమైంది. పాక్ ఆర్మీ కాల్పులను ధీటుగా తిప్పికొట్టింది. ఇరువర్గాల మధ్య దాదాపు 15 నిమిషాల పాటు ఫైరింగ్ జరిగినట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన వెల్లడించారు.
పాక్ కవ్వింపుల నేపథ్యంలో పూంచ్ సెక్టార్కు భారీగా బలగాలను తరలిస్తున్నట్లు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్, భారత్ ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. నాలుగు రోజుల దాడులు అనంతరం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తాజాగా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. అయితే, ఉన్నఫలంగా బార్డర్లో పాక్ ఆర్మీ కాల్పుల జరపడం వెనక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎల్ఓసీ గుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్లోకి చొరబడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు భద్రతా దళాలను అప్రమత్తం చేశాయి. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు ఎల్ఓసీ వెంబడి భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. బార్డర్లో సెక్యూరిటీ టైట్గా ఉండటంతో భారత ఆర్మీ దృష్టి మరల్చి ఉగ్రవాదుల చొరబాటుకు లైన్ క్లియర్ చేసేందుకు పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఫైరింగ్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.