
అమెరికా.. అగ్రరాజ్యం. దేశాలపై ఎలా పెత్తనం చేస్తుందో.. ఇతర దేశాలతో ఎలా వ్యవహరిస్తుందో ఈ అంశంపై చాలా చాలా క్లారిటీ వచ్చింది. ఓ వైపు ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటూ ప్రకటనలు చేస్తూనే.. ఉగ్రవాదులను తయారు చేసే పాకిస్తాన్ విషయంలో మాత్రం ఎక్కడ లేని ప్రేమను చూపిస్తుంది. పాకిస్తాన్ దేశం విషయంలో అమెరికాకు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం.
జూన్ 14వ తేదీన అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ వేడుకలను నిర్వహిస్తుంది అమెరికా. ఈ సందర్భంగా.. అమెరికా సైన్యం పరేడ్ కు.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది అగ్రరాజ్యం. అదే రోజు.. జూన్ 14వ తేదీన అధ్యక్షుడు ట్రంప్ 79వ పుట్టిన రోజు కావటం మరో విశేషం.
అమెరికా సైనిక పరేడ్ ఆహ్వానం మేరకు.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా బయలుదేరి వెళుతున్నారు. సైన్యం పరేడ్ లో పాల్గొన్న తర్వాత.. పెంటగాన్ అధికారులతోనూ సమావేశం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడు రోజులపాటు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. అమెరికాలోని సైనికాధికారులు, ఇతర ఉన్నతాధికారులతో భేటీలు నిర్వహించనున్నట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత.. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ దేశంలోని ఉగ్రవాద స్థావనాలను నాశనం చేసింది ఇండియా. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పూర్తి స్థాయి యుద్ధం మొదలు అవుతున్నది అనుకున్న క్రమంలోనే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగి.. ఇండియా, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని స్వయంగా ప్రకటించారు.
భారతదేశంలో ఉగ్రదాడుల వెనక పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని.. ఇండియా చాలా ఆధారాలు చూపించినప్పటికీ.. అమెరికాలో వైఖరిలో మార్పు లేదని ఈ ఘటనతో స్పష్టం అయ్యింది. పాకిస్తాన్ దేశంతో అమెరికా స్నేహభావం.. ఆప్యాయత బాగా ఉన్నట్లు మరోసారి నిరూపితం అయ్యింది. అమెరికా సైన్యం 250వ పరేడ్ కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను ఆహ్వానించటం.. పెంటగాన్ అధికారులతో సమావేశం కావటం అనేది అమెరికా రెండు కళ్ల సిద్దాంతానికి నిదర్శనం.
అమెరికా ఆర్మీ డే సందర్భంగా.. వాషింగ్టన్ డీసీలో అతి పెద్ద పరేడ్ నిర్వహిస్తుంది. 6 వేల 600 మంది సైనికులు, 150 ఆర్మీ వాహనాలు, 50 యుద్ధ విమానాలు ఈ కవాతులో పాల్గొంటున్నాయి. 2 లక్షలకు మందిపైగా జనం ఈ వేడుకకు హాజరుకాబోతున్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి.. ఉగ్రవాదులను తయారు చేస్తున్న.. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ దేశానికి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ను ఆహ్వానించటం అనేది అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.