
జమ్మూకశ్మీర్ యుద్ధంలో పోరాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మురళీనాయక్ వీరమరణం పొందడం తెలుగు ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పాకిస్థాన్ కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీనాయక్ వీరమరణం చెందారు. పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు చంపడంతో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. పాక్ కవ్వింపు చర్యల్ని ఎప్పటికప్పుడు భారత్ సైనికులు తిప్పి కొడుతున్నారు.
ఈ నేపథ్యంలో పాక్ సైన్యం కాల్పుల్లో శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కల్లితాండాకు చెందిన మురళీనాయక్ వీర మరణం పొందారు. ఈ విషాద వార్త తెలుగు సమాజ హృదయాన్ని బరువెక్కించింది. వీరోచిత పోరాటంలో దేశం కోసం మురళీనాయక్ అసువులుబాయడం తెలుగు ప్రజలంతా గర్వంగా సెల్యూట్ చేయాల్సిన సందర్భం ఇది.
జమ్ముకాశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీనాయక్ కుటుంబానికి ఆయన సంతాపం ప్రకటించారు. శోకతప్తులైన వారి కుటుంబీకులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్నారు.
మురళీనాయక్.. గోరంట్ల మండలం కళ్లితాండ గ్రామానికి చెందిన జ్యోతిబాయి, శ్రీరాముల నాయక్కు ఏకైక సంతానం . సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్ విద్యా వ్యాసం చేసిన ఆయన.. 2022లో ఇండియన్ ఆర్మీలో చేరాడు.. నాసిక్లో ట్రైనింగ్ పొంది, జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్ కు ట్రాన్స్ఫర్ అయ్యాడు.. పంజాబ్లో పనిచేస్తుండగా.. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం పంజాబ్ నుండి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లాడు.. కానీ, పాక్ కాల్పుల్లో వీరమరణం పొందాడు.. వీర జవాన్ మురళీ నాయక్ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు.. వీరజవాన్ మురళీ నాయక్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..