- పాక్ ఎయిర్బేస్లు పదింటిపై దాడి
- పూర్తిగా ధ్వంసమైన నూర్ ఖాన్, జాకోబాబాద్లో రన్వేలు, హ్యాంగర్లు
- ఇప్పటికీ రిపేర్లు చేసుకోని పాక్.. తాజా శాటిలైట్ ఫొటోల్లో వెల్లడి
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ చేసిన దాడుల నుంచి పాకిస్తాన్కు ఇంకా కోలుకోలేదు. ఆరు నెలలు అవుతున్నా ఆ దెబ్బల ప్రభావం నుంచి ఆ దేశం ఇంకా బయటపడలేని బలహీన స్థితిలో ఉంది. ఎటాక్స్లో ధ్వంసమైన పాక్ ఎయిర్బేస్ ల రిపేర్లు ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ విషయాన్ని తాజా శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి.
పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో 2025 మేలో భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలు, ఆ దేశానికి సంబంధించిన 10 ఎయిర్బేస్లపై భారత్ దాడి చేసింది. రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది. మురీద్, రాఫిక్వీ, ముషాఫ్, భోలారి, ఖద్రీం, సియాల్కోట్, సుక్కూర్, జాకోబాబాద్ ఎయిర్బేస్లు కూడా దాడుల్లో ధ్వంసమయ్యాయి. మన ఎయిర్ఫోర్స్ చేసిన దాడిలో పాక్ ఎయిర్బేస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
దాడులతో భారీ ఎఫెక్ట్
భారత్ ఆపరేషన్తో పాక్కు భారీ నష్టం వాటిల్లింది. నూర్ ఖాన్ ఎయిర్బేస్ తీవ్రంగా దెబ్బతిన్నది. అక్కడి హ్యాంగర్లు, రన్వేలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జాకోబాబాద్లో హ్యాంగర్ రూఫ్ కూలింది. పాక్ సైనిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. విమానాలు, సంబంధిత సామగ్రిని చాలావరకు నష్టపోయింది. ఈ దాడుల్లో భారత్ ఖచ్చితంగా లక్ష్యాలను గురిచూసి కొట్టింది. దీంతో పాక్ రక్షణ వ్యవస్థలు ఎంత బలహీనమైనవో ప్రపంచానికి తెలిసింది.
పూర్తికాని ఎయిర్బేస్ల రిపేర్
భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి దాదాపు ఆరు నెలలు అవుతున్నది. అయితే, పాక్ ఇంకా తమ ఎయిర్బేస్లను మరమ్మత్తు చేస్తూనే ఉన్నది. నూర్ ఖాన్లో కొత్త ఫెసిలిటీలను నిర్మిస్తున్నారు. అలాగే దాడి జరిగిన స్థలంలో పనులు కొనసాగుతున్నాయి. జాకోబాబాద్లో కూడా మరమ్మత్తు పనులు లేటు అవుతున్నాయి. తాజా శాటిలైట్ ఫొటోలతో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారత్ దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదని.. అలాగే ఆ దేశంలోని ఇతర ఎయిర్బేస్ల రిపేర్ పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని తేలింది. నిధుల కొరత, సామర్థ్య లోపం, సరైన సాంకేతికత లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నది.
