
- గత నాలుగేళ్లలో ఇదే అతిపెద్ద సింగిల్ డే లాస్
- ఆపరేషన్ సిందూరే కారణం
- లాభాల్లో ఇండియన్ మార్కెట్లు
న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా దాడులు జరపడంతో పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఎక్స్) బుధవారం భారీగా నష్టపోయింది. బెంచ్మార్క్ కేఎస్ఈ-100 ఇండెక్స్ ఒకే రోజులో 6,500 పాయింట్లు, అంటే దాదాపు 6 శాతం పతనమై 1,07,007 వరకు క్రాష్ అయ్యింది. పానిక్ సెల్లింగ్ చోటుచేసుకుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
ఎందుకీ పతనం?
భారత ప్రభుత్వం మంగళవారం రాత్రి "ఆపరేషన్ సిందూర్" పేరుతో సైనిక ఆపరేషన్ను నిర్వహించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేస్తూ మిసైల్ దాడులు జరిపింది. పహల్గాం టెర్రర్ అటాక్కు ప్రతీకారంగా ఈ దాడులు జరిపింది. కేఎస్ఈ-100 ఇండెక్స్ బుధవారం ఓపెనింగ్లోనే 6,272 పాయింట్లు (5.7 శాతం) పడిపోయి, 107,296.64కి చేరింది. 2021 తర్వాత ఇదే అతిపెద్ద సింగిల్ డే లాస్. చివరికి 4 శాతం నష్టంతో ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 22 న జరిగిన పహల్గాం టెర్రర్ అటాక్ నుంచి చూస్తే ఈ ఇండెక్స్ 9,930 పాయింట్లు కోల్పోయింది.
సెన్సెక్స్ 106 పాయింట్లు అప్
ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ముదిరినా, మన స్టాక్ మార్కెట్లు మాత్రం పెద్దగా స్పందించలేదు. బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం సెషన్ మొత్తం ఫ్లాట్గా కదిలాయి. చివరికి కొద్ది పాటి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు ( 0.13 శాతం) పెరిగి 80,746.78 వద్ద సెటిలయ్యింది. సెషన్ను మాత్రం 692 పాయింట్ల నష్టంతో ఓపెన్ చేసింది.
ప్రైవేట్ బ్యాంకులు, టాటా మోటార్స్ వంటి ఆటో షేర్లలో కొనుగోళ్లతో పూర్తిగా రికవర్ అయ్యింది. నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 24,414.40 వద్ద ముగిసింది. బ్రిటన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరడం కలిసొచ్చింది. బ్రాడ్ మార్కెట్లయిన నిఫ్టీ స్మాల్, మిడ్క్యాప్ ఇండెక్స్లు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. ఆటో, రియల్టీ, మెటల్ సెక్టార్లు పెరిగాయి.