
- బీజేపీ ఎంపీ డీకే అరుణ
పాలమూరు, వెలుగు: పాలమూరు అభివృద్ధి కోసం రాజీ లేని పోరాటం చేస్తానని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీగా ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తనను గెలిపించిన పాలమూరు జిల్లా ప్రజల రుణం తీర్చుకునేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. అమృత్ స్కీం కింద తన పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలకు రూ. 400 కోట్లు మంజూరు చేశానని చెప్పారు. స్మార్ట్ సిటీల కింద పాలమూరు కార్పొరేషన్ కు భారీగా నిధులు వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యామని తెలిపారు.
గ్రామాల్లో సీసీ రోడ్డు, కమ్యూనిటీ హాల్స్, డ్రైనేజీలు, ఐమాక్స్ లైట్లు, ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా జడ్చర్ల నుంచి రాయ్చూర్ వరకు నాలుగు లైన్ల రోడ్డుగా మార్చడానికి కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. ప్రస్తుత ఎన్ హెచ్ 44 కూడా ఆరు లైన్లుగా మారుతుందని చెప్పారు. నారాయణపేట మీదుగా ఎన్ హెచ్167 కర్ణాటక వెళ్లే రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. మహబూబ్ నగర్ మీదుగా వెళ్లే 167 కు అనుసంధానంగా బైపాస్ రోడ్డుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు.
70 ఏళ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇప్పించేలా కృషి చేస్తానన్నారు. అమృత్ రైల్వేస్టేషన్లో భాగంగా 39.87 కోట్లతో మహబూబ్ నగర్ స్టేషన్ ,10,94 కోట్లతో జడ్చర్ల రైల్వే స్టేషన్, రూ. 9.59 కోట్లతో షాద్నగర్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. వందే భారత్ రైలు మహబూబ్ నగర్ మీదుగా ప్రారంభించామన్నారు. కేంద్ర మంత్రుల సహకారంతో పాలమూరు అభివృద్ధికి మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పద్మజా రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.