చెన్నై: ప్రధాని మోడీ సూచనల మేరకే తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. మోడీ డైరెక్షన్స్కు తలూపుతూ, ఆయన చెప్పినట్లే పళని చేస్తున్నారని.. రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకోవడం లేదని కన్యాకుమారిలో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్ షోలో రాహుల్ ఆరోపించారు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నాడీఎంకే సర్కార్ను, ప్రధాని మోడీని టార్గెట్గా చేసుకొని రాహుల్ విమర్శలకు దిగారు.
‘తమిళ సంస్కృతిని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అవమానించకుండా చూసే బాధ్యత ప్రస్తుత సీఎంపై ఉంది. ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర అని మోడీ అంటూంటారు. తమిళం భారతీయ భాష కాదా? తమిళుల చరిత్ర భారతీయుల చరిత్ర కాదా? తమిళ కల్చర్ మనందరి కల్చర్ కాదా? ఓ భారతీయుడిలా తమిళ సంస్కృతిని కాపాడటం నా విధి. పళనిస్వామి మోడీ ముందు తలొగ్గుతారు. మోడీ ఏం చెబితే అదే అమలు చేస్తారు. ప్రధాని ముందు మోకరిల్లే వ్యక్తికి తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించే అర్హత లేదు’ అని రాహుల్ చెప్పారు.