
చేవెళ్ల, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ చేవెళ్ల సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్ తెలిపారు. బుధవారం చేవెళ్ల మండలంలోని ధర్మ సాగర్, గొల్లపల్లి, కమ్మెట, ఈర్లపల్లి, ఎనికేపల్లి, ఇబ్రహీంపల్లి, మీర్జాగూడ, బస్తేపూర్, కిష్టాపూర్, ఇంద్రారెడ్డి నగర్, నాంచేరి, రేగడి ఘన్పూర్ గ్రామాల పరిధిలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు.
సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ మాయమాటలతో తెలంగాణ వాసులను మోసం చేశారని భీం భరత్ మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కాలె యాదయ్య బీఆర్ఎస్కు అమ్ముడుపోయారన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఆయన వెంట సెగ్మెంట్ సీనియర్ నాయకులు వసంతం, జిల్లా ఉపాధ్యక్షుడు బండారు నాగిరెడ్డి, పడాల రాములు, మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రెడ్డిశెట్టి మధుసూదన్గుప్తా, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.