పాన్​ ఇక సింగిల్​ బిజినెస్​ ఐడీగా చట్టబద్ధం

పాన్​ ఇక సింగిల్​ బిజినెస్​ ఐడీగా చట్టబద్ధం

న్యూఢిల్లీ: ఈ బడ్జెట్​లో సామాన్యుల నుంచి వ్యాపార సంస్థల దాకా అందరికీ మేలు చేసే ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది.  పాన్​ (పర్మినెంట్​ అకౌంట్​ నెంబర్) ను సింగిల్​ బిజినెస్​ ఐడీగా చట్టబద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ​ప్రకటించారు.  ప్రస్తుతం వ్యాపారాలకు వివిధ రకాల అనుమతులు ఇచ్చేందుకు 20కిపైగా వివిధ రకాల కార్డులను ఐడీలుగా అడుగుతున్నారు. తాజా సంస్కరణతో ఇకపై పాన్​ కార్డు ఒక్కదాన్నే ఐడీగా సమర్పిస్తే సరిపోతుంది. దీంతో వ్యాపార సంస్థలకు అనుమతుల ప్రక్రియ మరింత సులభతరం కానుంది. వివిధ రంగాల్లో అనుమతులు, క్లియరెన్స్​ల కోసం జాతీయ స్థాయిలో సింగిల్​ విండో వ్యవస్థను తెచ్చే దిశగా ఇది కీలక అడుగని ఆర్థికమంత్రి అన్నారు.  

ప్రస్తుతం వ్యాపార సంస్థలు ఈపీఎఫ్ వో, ఈఎస్​ఐసీ, జీఎస్టీఎన్​, టీఐఎన్​, టీఏఎన్​, పాన్​ వంటి దాదాపు 20 రకాల ఐడీ కార్డులను చూపించి అవసరమైన పర్మిషన్స్​ తెచ్చుకుంటున్నాయి.  వ్యాపారాలు పెట్టినప్పుడల్లా ఈ కార్డులు అన్నింటి కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ఆయా వ్యక్తులు, పెట్టుబడిదారులకు విలువైన సమయం వృథా అవుతోంది. ఈ పరిస్థితికి చెక్​ పెడుతూ 2023 ఫైనాన్స్​ యాక్ట్​ కింద ఒక్క పాన్​ కార్డు నంబరుతోనే చట్టబద్ధత పొందేలా సంస్కరణను తీసుకొచ్చారు. పాన్​ కార్డు అనేది కేంద్ర ఆదాయ పన్నుశాఖ జారీ చేసే 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్​ సంఖ్య.