కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంది. దాంతో ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోయారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో ప్రజలెవరూ రోడ్లమీదికి రావడానికి కూడా సాహసించడంలేదు. అయితే.. ఊరికే ఉంటే ఉపాయాలు ఎక్కువ అన్నట్లు.. గుజరాత్ లో ఒక వ్యక్తి తనకు కావలసిన పాన్ మసాలాను డ్రోన్ ద్వారా తెప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. పాన్ మసాలా ప్యాకెట్లను టెర్రస్ మీద నిలబడ్డ వ్యక్తికి డ్రోన్ డెలివరీ చేయడం చూడవచ్చు.
గుజరాత్లోని మోర్బి అనే పట్టణంలో ఒక వ్యక్తి తనకు కావలసిన పాన్ మసాలాను డ్రోన్ ద్వారా డెలివరీ చేయించుకున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియా యాప్ టిక్టాక్లో అప్లోడ్ చేశారు. దాంతో ఆ వీడియో మరికొన్ని సోషల్ మీడియా యాప్ లలో వైరల్ గా మారింది.
ఆ వీడియోను చూసిన పోలీసులు స్పందించి.. పాన్ మసాలా పంపించిన వ్యక్తిని, అది తీసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీడియోను తాము ఇన్స్టాగ్రామ్లో చూశామని.. కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో మోర్బిలో డ్రోన్ ద్వారా సుగంధ ద్రవ్యాలు కూడా సరఫరా చేయబడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
చాలా రాష్ట్రాల్లో డ్రోన్ల ద్వారా మందును కూడా సరఫరా చేస్తున్నట్లు సమాచారం. టెక్నాలజీని వాడుకోవడంలో మన భారతీయులు చాలా దిట్ట అని మరోసారి రుజువయింది.
For More News..