
- వీడియో తీసింది తానేనన్న వైద్యాధికారి
- డైరెక్టర్కు, పోలీసులకు వాంగ్మూలం
- సోషల్మీడియాలో వైరల్చేసిందీ అతడేనా?
- ఘటన జరిగిన రోజే ఎందుకు చెప్పలేదనే ప్రశ్నలు
- ఆధిపత్య పోరే కారణమని అనుమానాలు?
పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ దవాఖానలోని ఆరోగ్య శ్రీ రూమ్లో పటాకులు ఉన్నాయంటూ నాలుగు రోజుల కింద ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్కాగా, అలా ఉన్నట్టు తమకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని పంజాగుట్ట పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే..అయితే, అగ్ని ప్రమాదం జరిగిన రోజు పక్కనే ఉన్న ఆరోగ్యశ్రీ గదిలో పటాకులు నిల్వ చేశారన్నది నిజమేనని, తాను వీడియో తీశానంటూ హాస్పిటల్కు చెందిన ఓ వైద్యాధికారి డైరెక్టర్తో పాటు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఘటన జరిగిన రోజే పోలీసులకు గానీ, నిమ్స్ఉన్నతాధికారులకు చెప్పకపోవడం, ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత బయటపెట్టడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
వీడియో తీసిన వ్యక్తే మీడియాకు లీకులు ఇచ్చి గ్రూపుల్లో వైరల్ అవడానికి కారణమయ్యాడని అంతా అనుకుంటున్నారు. దీనికి నిమ్స్లోని ఆధిపత్య పోరే కారణమని భావిస్తున్నారు. కాగా, వీడియో విషయమై శాఖాపరంగా ఇంటర్నల్ఎంక్వైరీ చేయిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు కూడా ఆరోగ్యశ్రీ విభాగం సిబ్బందిని విచారిస్తున్నట్టు సమాచారం. పోలీసులు మాత్రం దీనిపై నోరు విప్పడంలేదు.
షార్ట్సర్క్యూట్కారణం కాదా?
ఈ నెల19న నిమ్స్ హాస్పిటల్ఎమర్జెన్సీ బిల్డింగులోని ఐదో అంతస్తులోని ట్రామా బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు కమ్మడంతో పేషెంట్లు, డాక్టర్లు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ ప్రమాదం షార్ట్సర్క్యూట్వల్లే జరిగిందని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు కొత్త వాదన ఒకటి తెరపైకి వస్తోంది. అక్కడ కొద్ది రోజుల కింద కార్పెంటర్పని నడిచిందని, దీంతో అక్కడ చెత్త, చెక్క పొట్టు పేరుకుపోయిందని, ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి ఎవరో బీడీ, సిగరెట్ కాల్చి పడేయడం వల్లే ఫైర్యాక్సిడెంట్జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.