తిరువీర్ హీరోగా ఎస్.పి.దుర్గ నరేష్ దర్శకత్వంలో ఈటీవీ విన్, కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మించిన చిత్రం ‘పాపం ప్రతాప్’. ఏప్రిల్ 17న థియేటర్స్లో విడుదల కానుంది. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘తిరువీర్ మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇదొక మంచి కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారి పేరును ప్రస్తావించారు.
నాకు అది చాలా ఆనందంగా ఉంది. ఈ తరహా కామెడీ ఎంటర్టైనర్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉందని, టికెట్ కూడా రూ.వందలోపే ఉందని, ఇలాంటి ఆఫర్ మళ్లీ దొరకదని కార్యక్రమానికి హాజరైన దర్శకుడు హరీష్ శంకర్ అన్నాడు. ఇది ఈవీవీ సత్యనారాయణ గారి సినిమాలా అనిపిస్తుందని తిరువీర్ చెప్పాడు. బయటకు చెప్పుకోలేక లోపల బాధపడుతున్న ప్రతి మగాడికి ఈ సినిమా కేరాఫ్ అడ్రెస్ అవుతుందని డైరెక్టర్ దుర్గా నరేష్ అన్నాడు. ప్రేక్షకుడు పెట్టిన డబ్బుకు రెట్టింపు వినోదం దక్కుతుందని నిర్మాత రాకేష్ అన్నారు. బివిఎస్ రవి, దశరథ్, సాయిలు కంపాటి, ఈటీవీ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ పాల్గొన్నారు.
