వైకల్యం శరీరానికే.. సంకల్పానికి కాదు..! అవరోధం ఆట వరకే..ఆత్మవిశ్వాసానికి కాదు..! అగాధం మన వరకే.. స్ఫూర్తినిచ్చే వాళ్లకు కాదు..!వడివడిగా నడవలేం.. రయ్య్మంటూ పరుగెత్తలేం.. పక్షిలా విహరించలేం..!కానీ గెలుపు కాంక్షను రగిలిస్తాం..! ఉత్సాహాన్ని ఉరుముల్లా ప్రసరిస్తాం..! ఊపిరినే రెక్కలుగా మలిచి.. విజయతీరాలకు చేరుతాం..! గెలుపు ఒక్కరిదే అయినా.. దేశ ప్రతిష్టను ఇనుమడింప చేస్తాం..! మా ఆశలకు అద్భుతాన్ని జోడిస్తాం.. అంతర్జాతీయ యవనికపై మాకంటూ ఓ గొప్పతనాన్ని తీసుకొస్తామంటూ.. 163 దేశాలకు చెందిన 4403 మంది పారా అథ్లెట్లు ఏకమై.. నినదించిన వేళ.. టోక్యో పారాలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి..!
టోక్యో: సాధారణ ఒలింపిక్స్కు ఏమాత్రం తీసిపోకుండా.. కరోనా భయంతో వణికిపోతున్న ప్రపంచాన్ని మరోసారి మంత్రముగ్దులను చేస్తూ.. తమకు మాత్రమే సాధ్యమైన థీమ్స్తో, అసాధారణమైన విన్యాసాలతో.. జపాన్ సంస్కృతి, సాంప్రదాయాలకు విలువనిస్తూనే.. ఆధునికత భావుకతను తెలిపేలా.. రంగురంగుల లేజర్ కిరణాల మధ్య ‘టోక్యో పారాలింపిక్స్–2020’ మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేషనల్ స్టేడియంలో ఫ్యాన్స్ లేకుండా.. అతి తక్కువ మంది ఆతిథుల మధ్య.. ‘మాకు రెక్కలున్నాయి’ అనే సెంట్రల్ థీమ్తో ప్రోగ్రామ్ ఆద్యంతం కలర్ఫుల్గా సాగింది. ఊహించలేని ప్రతికూలతలు ఎదురైనా.. ఎగరడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ పారా అథ్లెట్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పారాలింపిక్స్ ఫ్లాగ్ స్టేడియంలోకి తీసుకురావడంతో.. గేమ్స్ మొదలైనట్లు జపాన్ చక్రవర్తి నరుహిటో ప్రకటించారు. కరోనా నేపథ్యంలో గేమ్స్ను సేఫ్గా నిర్వహించాలని పారాలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ అండ్రూ పెర్సన్స్ కోరారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇక్కడ ఉన్నామనంటే నమ్మలేకపోతున్నామని పెర్సన్స్ వ్యాఖ్యానించారు.
టోక్యోలో సెకండ్ టైమ్..
దాదాపు 57 ఏళ్ల తర్వాత టోక్యోలో పారాలింపిక్స్ను నిర్వహిస్తున్నారు. అయితే రెండోసారి గేమ్స్ నిర్వహించడం ద్వారా గతంలో ఏ సిటీకి దక్కని అరుదైన హోదా టోక్యో దక్కించుకుంది. పారా ఎయిర్పోర్ట్ సెట్తో ఓపెనింగ్ సెర్మనీ మొదలైంది. ఇందులో పారా అథ్లెట్ల స్ట్రెంత్ను చూపెట్టేలా ఓ వీడియోను ప్రదర్శించారు. ఓ చిన్న గాలి, పెను దుమారంలా మారి ఆటలు జరిగే మైదానాన్ని ముంచెత్తుంది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ సిబ్బంది కౌంట్డౌన్ మొదలుపెడతారు. లాస్ట్లో ఫైర్వర్క్స్తో స్టేడియం మొత్తం జిగేల్మంది. ఆరుగురు మెంబర్స్ జపాన్ ఫ్లాగ్ను స్టేజ్పైకి తీసుకొచ్చారు. బ్యాక్ గ్రౌండ్లో సోంబ్రే మ్యూజిక్తో అక్కడి ప్రాంతమంతా సందడిగా మారింది. పారా ఎయిర్పోర్ట్ రన్వేపై టోక్యోలో 22 క్రీడాంశాలను ఇంట్రడ్యూస్ చేయడంతో ఫస్ట్ వీడియో ముగిసింది.
స్టేజ్ చుట్టూ జెయింట్ ప్రొపెల్లర్స్, బెలూన్స్తో పారాలింపిక్స్ సింబల్ను క్రియేట్ చేశారు. నేషన్స్ పెరేడ్ తర్వాత 13 ఏళ్ల అమ్మాయి యు వీగో వీల్చైర్లో వచ్చి చేసిన థీమ్ అదరహో అనిపించింది. వైకల్యంతో తాను ఎగరలేను అన్న ఆలోచనను అధిగమించి.. చీకట్లో నుంచి ఎయిర్పోర్ట్ రన్వేపై ఆమె దిగే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తమవైన ఆలోచనలు, ఆశలు ఉంటాయనే కాన్సెప్ట్తో చేసిన ఈ విమానం థీమ్ చూపరులను ఆకర్షించింది. ప్రతి మనిషి సొంత రెక్కలతో ఆలోచన విధానాన్ని పెంచుకుంటూ ఎక్కడికైనా ధైర్యంగా వెళ్లొచ్చని ఇందులో చూపెట్టారు. జపాన్ ట్రెడిషన్ అయిన కారాకురి డ్యాన్స్లతో పాటు మంచి క్యాస్ట్యూమ్ డిజైన్స్తో వాలంటీర్లు, పారా అథ్లెట్లు విన్యాసాలు చేశారు. పోల్ డ్యాన్సింగ్ కూడా అదరహో అనిపించింది.
నేషన్స్ పెరేడ్లో ఓ కుక్క.. ఇజ్రాయిల్ బృందానికి ముందుండి దారి చూపెట్టింది. ఇది చూపరును విశేషంగా ఆకర్షించింది. రెఫ్యూజీ టీమ్ ఫస్ట్ ఎంట్రీ ఇవ్వగా, అఫ్గానిస్తాన్ ఫ్లాగ్ రావడంతో విపరీతమైన స్పందన వచ్చింది. మీడియా, అక్కడ పని చేసే వర్కర్స్ అఫ్గాన్కు సంఘీభావంగా కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. అఫ్గాన్ తరఫున జకియా ఖుదాదాడి, హోస్సేన్ రాసౌలీ బరిలోకి దిగాల్సి ఉండగా, ఆందోళనలతో ఈ ఇద్దరూ గేమ్స్ నుంచి విత్ డ్రా అయ్యారు. రియో ఒలింపిక్స్లో మొత్తం 4328 అథ్లెట్లు పాల్గొనగా, ఈసారి ఆ సంఖ్య 4403కి పెరిగింది. ఇందులో 2250 పురుష అథ్లెట్లు కాగా, 1853 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. ఇండియా నుంచి 54 మంది బరిలో ఉన్నారు. 12 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి.
ఫ్లాగ్ బేరర్గా టెక్ చంద్
నేషన్స్ పెరేడ్లో షాట్ ఫుటర్ టెక్ చంద్.. ఇండియా ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించాడు. వాస్తవానికి రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పతాకధారిగా వ్యవహరించాల్సి ఉంది. కానీ కొవిడ్ పాజిటివ్ పర్సన్తో క్లోజ్గా ఉండటంతో.. మరియప్పన్తో పాటు ఐదుగుర్ని క్వారంటైన్లో ఉంచారు. డిస్కస్ త్రోయర్ వినోద్ కుమార్ కూడా ఈ లిస్ట్లో ఉన్నాడు. దీంతో వీళ్లెవర్ని ఓపెనింగ్ సెర్మనీకి అనుమతించలేదు. అయితే మరియప్పన్, వినోద్కు నిర్వహించిన కొవిడ్ టెస్ట్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని చెఫ్ డీ మిషన్ గురుశరణ్ సింగ్ వెల్లడించాడు. ఈ ఇద్దరు యధావిధిగా పోటీల్లో పాల్గొంటారని చెప్పాడు. టెక్ చంద్తో పాటు గురుశరణ్, అర్హన్ భగతి, ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, కోచ్ సత్యనారాయణ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్నారు.