
- స్పీకర్ ఓం బిర్లా ప్రతిపాదనకు ప్రతిపక్షాలు ఓకే
న్యూఢిల్లీ: లోక్సభ సమావేశాలు ఇకనుంచి ఎలాంటి నిరసనలు లేకుండా కొనసాగనున్నాయి. ఈ మేరకు అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి ప్రతిపక్షాల నిరసనలతో ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. బిహార్ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఆపరేషన్ సిందూర్పై ప్రతిపక్షాలు ప్రతిరోజూ ఆందోళన చేస్తుండటంతో సభలు వరుసగా వాయిదా పడుతున్నాయి.
శుక్రవారం ఐదోరోజు కూడా ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఈనేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు.
క్వశ్చన్ అవర్ సమయంలో కొనసాగుతున్న నిరసనలపై ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్లమెంట్ నియమాలను పాటించాలని, సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని స్పీకర్ కోరారు. దీనికి ప్రతిపక్షాలు అంగీకరించాయి. ఈ నెల 28న ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చించేందుకు కేంద్రం ఒప్పుకున్నది. దీనిపై ప్రతిపక్షాలు లేవనెత్తిన కొన్ని డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా
స్పందించినట్టు సమాచారం.