వరంగల్​ వార్​కు పార్టీలు రెఢీ

వరంగల్​ వార్​కు పార్టీలు రెఢీ

హామీల వరద.. కబ్జాల బురద..

అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం షురూ
శంకుస్థాపనల హడావుడిలో టీఆర్ఎస్ లీడర్లు
అమలుకాని హామీలపై ప్రజల్లోకి ప్రతిపక్షాలు
ప్రభావం చూపనున్న ప్రభుత్వ వైఫల్యాలు, ఇటీవలి వరదలు

వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్ లో పాగా వేసేందుకు ప్రతిపక్షాలు, మేయర్​ పదవిని మరోసారి చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ అన్ని రకాల వెపన్స్​ రెడీ చేసుకుంటున్నాయి. సిటీలో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్యలు,  ప్రభుత్వ పెద్దల అమలుకాని హామీలు, గత నెలలో వచ్చిన వరదలు, అధికారపార్టీ నేతల నాలాల ఆక్రమణ, కబ్జాలే ప్రధాన  ఎజెండాగా కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ప్రజల్లోకి వెళ్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, గత నాలుగన్నరేళ్లుగా చేసిన పనులు, పనితీరును జనాల్లోకి తీసుకెళ్లి గట్టెక్కాలని టీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. ఎలక్షన్స్​ టైం దగ్గర పడుతుండడంతో అధికార పార్టీ లీడర్లు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేస్తుండగా, ప్రతిపక్ష లీడర్లు అదునుచూసి రంగంలోకి దిగుతున్నారు.  మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కొండా సురేఖ లాంటి లీడర్ యాక్టివ్​మోడ్​లోకి రావడం, సమయం వచ్చినప్పుడల్లా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తో పాటు ఇతర పెద్ద లీడర్లు సిటీలో అడుగుపెడుతుండటంతో గ్రేటర్ లో ఇప్పటినుంచే ఎలక్షన్​హడావిడి మొదలైంది.  కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఆల్రెడీ మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది.

ఇదీ గ్రేటర్‌‌‌‌ ప్రస్థానం..

రాష్ట్రంలో హైదరాబాద్  తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన సిటీ వరంగల్. గతంలో నగరపాలకసంస్థగా ఉన్న వరంగల్‌‌‌‌ లో చుట్టుపక్కల ఉన్న 42 గ్రామాలను కలిపి 58 డివిజన్లతో 2015 జనవరిలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గ్రేటర్ గా అవతరించిన తర్వాత 2016లో 58 డివిజన్లకు ఎన్నికలు జరుగగా.. టీఆర్ఎస్ నుంచి 44 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. కాంగ్రెస్ 4, సీపీఎం, బీజేపీలు చేరో స్థానం సంపాదించాయి. ఇండిపెండెంట్లు ఎనిమిది స్థానాల్లో జెండా ఎగురవేసి, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వారు కూడా టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వేముల  శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరగా, టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎంబాడి రవీందర్ కాంగ్రెస్ కు జంప్ అయ్యారు. పూర్తిస్థాయి మెజారిటీ రావడంతో మొదటి మేయర్ గా బాధ్యతలు చేపట్టిన నన్నపనేని నరేందర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి  గెలిచారు. అనంతరం మేయర్‌‌‌‌గా గుండా ప్రకాశ్‌‌‌‌రావ్ బాధ్యతలు తీసుకున్నారు. ఇంకో ఆరు నెలల్లో పాలకవర్గం గడువు ముగియనుంది.

ప్రజా సమస్యలే ఎజెండా..

సిటీ వేగంగా విస్తరిస్తుండటం.. అనేక కొత్త కాలనీలు ఏర్పడుతుండటంతో నగర జనాభా ప్రస్తుతం 11 లక్షలు దాటింది. కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్పొరేషన్ డెవలప్ మెంట్ మాత్రం జరగడంలేదు. కొద్దిపాటి వర్షం కురిసినా నగర రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సిటీకి చుట్టుపక్కల ఉన్న దాదాపు 42 చెరువులు కబ్జాల పాలుకావడం.. కొందరు లీడర్లు ఏకంగా నాలాల మీదే బిల్డింగులు కట్టడంతో వరద నీరు కాలనీలను ముంచెత్తుతోంది. వానలు తగ్గినా కొద్దిరోజుల వరకు కాలనీలు నీళ్లల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇక గ్రేటర్‌‌‌‌ లో విలీనమైన గ్రామాలను పట్టించుకునేవాళ్లు లేక కనీస సౌకర్యాలు కరువయ్యాయి. గ్రేటర్‌‌‌‌ పరిధిలో ఉన్న 183 స్లమ్‌‌‌‌ ఏరియాల్లో తక్కువలో తక్కువ 50 వేల జనాభా ఉంటోంది. ఈ నాలుగున్నరేళ్లలో ఆ ఏరియాల వైపు కన్నెత్తి చూసినవాళ్లే లేరు. ఇలా వివిధ సమస్యలు చుట్టుముట్టడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలను ప్రధానంగా లేవనెత్తుతూ ప్రతిపక్షాలు జనాల్లోకి పోతున్నాయి.

సీఎం హామీలూ అమలుకాలే..

2015 జనవరిలో సీఎం కేసీఆర్‌‌‌‌ సిటీలో పర్యటించి, గ్రేటర్‌‌జనాలపై లో వరాల జల్లు కురిపించారు. ఏటా బడ్జెట్‌‌‌‌లో రూ. 300 కోట్లు ఇస్తామని  హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.80 కోట్లు మాత్రమే. నిరుపేదలకు డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ కూడా మాటలకే పరిమితమైంది. పేదలకు 3,900 ఇండ్లు ఇస్తామని చెప్పినా అందులో ఒక్కటి కూడా వందశాతం కంప్లీట్ కాలేదు.  గత మార్చి 11న మాస్టర్‌‌‌‌ప్లాన్‌‌‌‌పై మంత్రి కేటీఆర్‌‌‌‌ ఉమ్మడి జిల్లా నేతలతో మీటింగ్‌‌‌‌ పెట్టినప్పుడు దసరా వరకు డబుల్ బెడ్​రూం ఇండ్లు పూర్తి చేయాలని ఆఫీసర్లు, లీడర్లకు సూచించారు. కానీ దసరా వరకు 400 ఇండ్లయినా రెడీ అవుతాయో లేదోనన్న సందేహాలున్నాయి. స్మార్ట్‌‌‌‌సిటీ స్కీం కింద కేంద్రం రూ.196 కోట్లు విడుదల చేస్తే.. రాష్ట్రం రెండు విడతల్లో కేవలం రూ.84 కోట్లు మాత్రమే ఇచ్చింది. అలాగే శంకుస్థాపనలు జరిగిన 15 స్మార్ట్‌‌ రోడ్లు, భద్రకాళి బండ్‌‌ పనులు నత్త నడకగా సాగుతున్నాయి. సిటీ రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు చేయడం లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు.   కొన్ని డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానవాటికలు కూడా లేని పరిస్థితి నెలకొంది. అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ డ్రైనేజీ మాటలకే పరిమితమైంది. గుడిసె వాసులకు పట్టాలు ఇస్తామన్న హామీ ముచ్చటే లేకుండా పోయింది. మాస్టర్ ప్లాన్‌‌‌‌ అమలు కూడా కాగితాలకే పరిమితమైంది.  ఇలా స్వయంగా సీఎం ఇచ్చిన హామీలన్నీ పెండింగ్‌‌‌‌లోనే ఉండటంతో వాటిని ప్రతిపక్షాలు క్యాష్​‌‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

రెడీ అవుతున్న పార్టీలు

గత నాలుగున్నరేళ్లుగా నిధుల లేమితో కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో అభివృద్ధి పనులేమీ జరగలేదు. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇదే విషయాన్ని కార్పొరేటర్లు పలుమార్లు కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లోనూ ప్రస్తావించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికల నగారా మోగనుండడంతో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీలో కంగారు మొదలైంది. దీంతో ఎన్నడూలేనంతగా గత నెలలో జరిగిన కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులకు తీర్మానం చేశారు. స్మార్ట్‌‌సిటీ, పట్టణ ప్రగతి, ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​, జనరల్‌‌ ఫండ్స్‌‌, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.183 కోట్లతో ప్రతి కార్పొరేటర్‌‌‌‌ కు నామినేషన్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ కింద రూ.5 లక్షలు కేటాయించారు. ఇకనుంచి నెలకు రెండు సార్లు కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ పెట్టాలని తీర్మానించారు. దీంతో డివిజన్లలో అభివృద్ధి పనుల హడావుడి మొదలైంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఇప్పటికే కమిటీల ఏర్పాటు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అసంతృప్తులను ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, కాంగ్రెస్‌‌‌‌ నేత కొండా సురేఖ ఆధ్వర్యంలో చేరికలపై దృష్టిపెట్టారు. ఇక బీజేపీ అర్బన్‌‌‌‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని చెబుతూ వస్తుండగా.. సమయం వచ్చినప్పుడల్లా ఆ పార్టీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ బండి సంజయ్‌‌‌‌ నగరానికి వచ్చి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక వామపక్ష పార్టీలు, టీడీపీ కూడా తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ సారి గ్రేటర్‌‌‌‌లో డివిజన్ల సంఖ్య 66కు పెరిగే అవకాశం ఉండటంతో ఇతర ఆశావాహులు కూడా తమతమ గాడ్‌‌‌‌ ఫాదర్‌‌‌‌లను ఆశ్రయిస్తున్నారు.

ఇప్పటి నుంచే పోరు

బల్దియా పోరులో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ ఇప్పటికే గ్రౌండ్‌‌‌‌ వర్క్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశాయి.  మాజీ మంత్రి కొండా సురేఖ, తూర్పు ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం మొదలైంది. తాము టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో ఉన్నప్పుడు ఐదారు కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేటర్లను గెలిపించామని కొండా సురేఖ బహిరంగంగా ఆరోపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రజల్లో పేరును బట్టే గెలిచామని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక బీజేపీ సైలెంట్‌‌‌‌గా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ భుజాన వేసుకుంటుంటే, కాంగ్రెస్‌‌‌‌, బీజేపీలు నగర ప్రజలకు సీఎం ఇచ్చిన హామీలు, ప్రభుత్వ వైఫల్యాలు, లీడర్ల కబ్జాలు, వరద పరిస్థితులతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో ఆరు నెలల ముందుగానే గ్రేటర్‌‌‌‌ లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

ప్రధాన సమస్యలు ఇవీ..

స్లమ్‌‌‌‌ ఏరియాలు, విలీన గ్రామాల్లో కనిపించని అభివృద్ధి

నేటికీ పూర్తికాని డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్లు

చెరువులు, భూముల ఆక్రమణలు

సరైన డ్రైనేజీ సిస్టమ్​ లేకపోవడం

కబ్జాకు గురైన నాలాలు.. కాల్వలపైనే లీడర్ల ఇండ్లు

ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతున్న లోతట్టు ప్రాంతాలు

For More News..

కొండపోచమ్మ కట్టకు బుంగలు