భద్రాచలం నుంచి కుంజా ధర్మారావు , ఇల్లెందు బరిలో రవీందర్​నాయక్

భద్రాచలం నుంచి కుంజా ధర్మారావు , ఇల్లెందు బరిలో రవీందర్​నాయక్
  • ఇల్లెందు బరిలో రవీందర్​నాయక్
  • ఫస్ట్​ లిస్ట్​లో టికెట్లు కన్ఫామ్​చేసిన బీజేపీ హైకమాండ్

భద్రాచలం/ఇల్లెందు, వెలుగు: భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాల బీజేపీ క్యాండేట్లను ఆ పార్టీ హైకమాండ్​ఆదివారం ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉండగా, ఫస్ట్ లిస్ట్​లో ఇద్దరిని కన్ఫామ్​చేసింది. భద్రాచలం టికెట్​ను కుంజా ధర్మారావుకు కేటాయించింది. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారు. 2009 ఎన్నికల్లో ఆమె భద్రాచలం నుంచి గెలిచి నియోజకవర్గానికి సేవలందించారు. ఆమె స్థానంలో భర్త ధర్మారావుకు పార్టీ టికెట్​ఇచ్చింది. 

ఇంటర్​వరకు చదువుకున్న ధర్మారావు ప్రస్తుతం బీజేపీ స్టేట్​కౌన్సిల్ మెంబర్​గా వ్యవహరిస్తున్నారు. 1980 నుంచి 2009 వరకు సీపీఎంలో ఉన్న ధర్మారావు 2001 నుంచి 2005 వరకు దుమ్ముగూడెం జడ్పీటీసీగా కొనసాగారు. 2009లో భార్యతో కలిసి కాంగ్రెస్​లో చేరారు. తర్వాత కాంగ్రెస్​ను వీడి 2010–-12 వరకు వైఎస్ఆర్​కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో బీజేపీలో చేరి పార్టీ కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. భద్రాచలం నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లో కుంజా ధర్మారావుకు మంచి పట్టు ఉంది. 

త్రిముఖ పోరు తప్పదా? 

వరంగల్ మాజీ ఎంపీ, సీనియర్​నేత రవీందర్ నాయక్​ను బీజేపీ ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. రవీందర్ సొంతూరు జనగామ జిల్లా కొడకండ్ల మండలం, మొండ్రాయి గ్రామం. హైదరాబాద్​ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తిచేసిన ఆయన 1978లో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్​అభ్యర్థిగా పోటీచేశారు. సమీప సీపీఐ అభ్యర్థి కేతావత్ హరియాపై 15,674 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1983లో 3,160 ఓట్ల మెజారిటీతో రెండోసారి గెలిచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు. 

1998లో ఖమ్మం లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, 2004లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్​)​ వరంగల్​అభ్యర్థిగా పోటీచేశారు. టీడీపీ అభ్యర్థి బోడకుంటి వెంకటేశ్వర్లుపై గెలిచి ఎంపీ అయ్యారు. తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. రవీందర్ నాయక్​ లంబాడీలు, ఎరుకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషిచేసి బంజారా గాంధీగా పేరు పొందారు. రవీందర్​నాయక్ ను ఇల్లెందు బరిలో దింపడంతో ఇక్కడ త్రిముఖ పోరుకు తెరలేపినట్లయింది. బీఆర్ఎస్​నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ పోటీచేస్తుండగా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.