హనుమకొండ, వెలుగు: ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయాలనే డిమాండ్తో ఎమ్మెల్యే వెహికిల్ను అడ్డుకున్న రైతులను చితకబాదినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్ ట్రాన్స్ఫర్ అంశం వివాదాస్పదమైంది. విశ్వేశ్వర్ను మొదట వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి.. గంట వ్యవధిలోనే కొత్తగా ఏర్పాటవుతున్న ఏనుమాముల పీఎస్ కు ఇన్ స్పెక్టర్గా నియమించడం విమర్శలకు తావిచ్చింది. సీఐ ట్రాన్స్ఫర్ విషయంలో సీపీ డా.తరుణ్ జోషి వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది.
సీపీకి ఫిర్యాదు చేసినా..
ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 31న పెరుమాండ్లగూడెంలో ఎమ్మెల్యే రమేశ్ను పలువురు రైతులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో శ్రీనివాస్, నిరంజన్, మురళి అనే రైతులను తెల్లవారుజామున స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారు సీఐ విశ్వేశ్వర్, ఎస్సై భరత్ పై సీపీకి ఫిర్యాదు చేశారు. అయినా యాక్షన్ తీసుకోకపోవడంతో సీపీ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం సీఐ విశ్వేశ్వర్ను వీఆర్కు బదిలీ చేస్తూ మొదట ఉత్తర్వులు ఇచ్చారు. అయితే గంటలోనే అతనిని ఏనుమాముల స్టేషన్కు సీఐగా పోస్టింగ్ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఈ బదిలీ వెనుక రాజకీయ కారణాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులను అక్రమంగా స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదిన సీఐకి సీపీ పనిష్మెంట్ ఇస్తాడని భావిస్తే.. ప్రమోషన్ ను తలపించే పోస్టింగ్ ఇచ్చి వెనుకేసుకు రావడమేమిటని రైతులు, ప్రజా సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, కమిషనరేట్ పరిధిలో విశ్వేశ్వర్ తో పాటు ఇంకో ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో ఒంటేరు రమేశ్ను సీఎస్బీ నుంచి ధర్మసాగర్కు, అక్కడి సీఐ బొల్లం రమేశ్ ను వీఆర్కు ట్రాన్స్ ఫర్ చేశారు. వీఆర్లో ఉన్న అనుముల శ్రీనివాస్ కు పర్వతగిరి సీఐగా పోస్టింగ్ ఇచ్చారు.