సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలపై ఇటీవల కాలంతో వారి వ్యక్తిగత జీవితంపై ట్రోల్స్, సోషల్ మీడియా వేదికగా ఇష్టానురీతిలో డీప్ ఫేక్ సృష్టిస్తూ రెచ్చిపోతున్నారు కొందరు ప్రబుద్ధులు. దీంతో సినీతారలు తమ వ్యక్తిగత జీవితం, ప్రతిష్టను కాపాడుకోనేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ ధోరణిలో భాగంగా పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే కోర్టు మెట్లెక్కారు.
వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం పోరాటం...
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున తమ ప్రైవసీకి భంగం కలగకుండా కాపాడాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరి బాటలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన వ్యక్తిగత హక్కులను పరిరక్షించుకునేందుకు ఢిల్లీ హైకోర్టును సంప్రదించారు. ఈ ప్రముఖులు తమకు సంబంధించిన తప్పుడు వార్తలు, ట్రోల్స్, అభ్యంతరకర కంటెంట్ను సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని కోరారు. ముఖ్యంగా, వారి వ్యక్తిగత జీవితంపై ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా, వారి అనుమతి లేకుండా చిత్రాలను, వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని కోరారు.
ఢిల్లీ హైకోర్టుకు పవన్..
ఈ కోవలోనే లేటెస్ట్ గా జనసేన అధినేత, నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమపై సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు, అనవసర వ్యాఖ్యలు చేయకుండా, తమ వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరుతూ పిటిషన్ను దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు , వ్యక్తిగత సమాచారాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించకుండా చూడాలని కోర్టును కోరారు, తమపై దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' . ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి స్టైలిష్ పోలీస్ ఆఫీసర్గా కనిపిచనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ యాక్షన్ డ్రామాను మార్చి 26, 2026న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

